ఈ దేశం నాది కాదు.. మోదీ-షా, థాక్రేలది అంతకన్నాకాదు..! సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ

సంజయ్ రౌత్‌కు చేసినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్టు విషయంలో ప్రధాని మోదీని శరద్‌ పవార్‌ ఎందుకు కలవలేదు: ఓవైసీ

ఈ దేశం నాది కాదు.. మోదీ-షా, థాక్రేలది అంతకన్నాకాదు..! సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ
Aimim Chief Owaisi

Updated on: May 29, 2022 | 2:07 PM

AIMIM chief Owaisi: మహారాష్ట్ర భీవాండీ పర్యటనలో భాగంగా శనివారం జరిగిన సభలో ఏఐఎమ్‌ఐఎమ్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా భారత దేశం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా నాది (ఏఐఎమ్‌ఐఎమ్‌) కాదు, థాక్రే, మోదీ-షాలది అసలేకాదు. మొఘలుల అనంతరం ఇండియా ఎవరికైనా చెందితే అది ద్రవిడియన్లు, ఆదివాసీలకు మాత్రమే చెందుతుంది. ఆఫ్రికా, ఇరాన్‌, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుంచి వచ్చిన వలసదారుల వల్ల ఇండియా ఏర్పడింది. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌)ల వల్ల ఏర్పడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి మొఘలులు వచ్చి వెళ్లిన తర్వాతే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు వెలుగులోకి వచ్చాయన్నారు.

ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌పై మండిపడ్డారు. బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), సమాజ్‌వాద్‌, కాంగ్రెస్‌లు సెక్యులర్ (లౌకిక) పార్టీలు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ అరెస్టుపై (సీబీఐ, ఈడీ) కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి యాక్షన్‌ తీసుకోవద్దని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రధాని నరేంద్రమోదీని కలిశాడు. ఎన్సీపీ కార్యకర్తలను అడుగుతున్నాను.. సంజయ్ రౌత్‌కు చేసినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్టు విషయంలో ప్రధాని మోదీని శరద్‌ పవార్‌ ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. నవాబ్‌ మాలిక్‌ ముస్లీం కావడం వల్లేనా? సంజయ్ రౌత్ కంటే నవాబ్ మాలిక్ తక్కువా? సంజయ్, నవాబ్ ఇద్దరూ సమానం కాదా? అని ఓవైసీ విమర్శించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఇవి కూడా చదవండి
Follow Us