
PM Modi France Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ శుక్రవారం ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

బాస్టిల్ డే పరేడ్లో గౌరవ అతిథిగా.. ప్రధాని మోడీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు గౌరవవందనాన్ని స్వీకరించారు.

యూరప్లో అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ పరేడ్లో భారతీయ త్రివిధ దళాలు సైతం పాల్గొన్నాయి. ఫ్రాన్స్, ఇండియా సైనికుల ఈ పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

బాస్టిల్ డే పరేడ్ లో ఫ్రెంచ్ జెట్లతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు కూడా ఫ్లైపాస్ట్లో చేశాయి.

"భారతదేశం, శతాబ్దాల నాటి తత్వంతో ప్రేరణ పొందింది.. శాంతియుతంగా, సుసంపన్నంగా.. సుస్థిరమైనదిగా మార్చడానికి కట్టుబడి ఉంది. బలమైన, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు 1.4 బిలియన్ల భారతీయులు ఫ్రాన్స్కు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతారు. బంధం మరింత లోతుగా సాగుతుంది" అని మోదీ ట్వీట్ చేశారు.

"ప్రపంచ చరిత్రలో ఒక దిగ్గజం, భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించాలి, వ్యూహాత్మక భాగస్వామి, స్నేహితుడు.. 14 జూలై పరేడ్లో గౌరవ అతిథిగా భారతదేశాన్ని స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము" అని అంతకుముందు మాక్రాన్ ట్వీట్ చేశారు.

ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రాన్.. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.