
కలుషిత నీరు - బ్యాక్టీరియా ముప్పు: వర్షాల వల్ల నదులు, చెరువులు, సముద్ర తీరాల్లోని నీరు విపరీతంగా కలుషితమవుతుంది. ఈ నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు, టాక్సిన్లు అధికమవుతాయి. జలచరాలు అయిన చేపలు ఈ కలుషిత వాతావరణంలో పెరగడం వల్ల వాటి శరీరంలోకి ఇవి సులభంగా ప్రవేశిస్తాయి. ఇలాంటి చేపలను తినడం వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ వంటి తీవ్రమైన ఆహార కాలుష్య వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు: వర్షాకాలంలో జంతువుల మూత్రం ద్వారా నీటిలో కలిసే లెప్టోస్పిరోసిస్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. నీటి వనరులలో ఉండే చేపలు కూడా ఈ వ్యాధుల బారిన పడతాయి. ఇన్ఫెక్షన్ సోకిన చేపలను మనం ఆహారంగా తీసుకుంటే.. అది నేరుగా మానవ శరీరంపై ప్రభావం చూపి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

రవాణా, నిల్వ చేయడం: వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ తరచూ దెబ్బతింటుంది. దీనివల్ల చేపలను మార్కెట్లకు తరలించడంలో ఆలస్యం జరుగుతుంది. పైగా వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చేపలు చాలా త్వరగా కుళ్లిపోతాయి. కొన్నిసార్లు చూడ్డానికి ఫ్రెష్గా కనిపించినప్పటికీ.. అంతర్గతంగా వాటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంటుంది. వ్యాపారులు సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా ఇవి మరింత కలుషితమవుతాయి.

చేపల సంతానోత్పత్తి కాలం: ఇది పర్యావరణ పరంగా అత్యంత ముఖ్యమైన కారణం. వర్షాకాలం అనేది చాలా రకాల చేపల జాతులకు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో అవి గుడ్లు పెట్టడానికి మంచి నీటి వనరుల వైపు వలస వెళ్తాయి. ఈ సీజన్లో చేపల వేట సాగిస్తే వాటి పునరుత్పత్తి చక్రం దెబ్బతిని, చేపల జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, స్థిరమైన మత్స్య సంపదను పెంపొందించడానికి వర్షాకాలంలో చేపలను తినకుండా ఉండటమే మంచి పద్ధతి.

చేపల్లో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. వర్షాకాలంలో వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా ఎక్కువ. కాబట్టి ఈ మూడు నాలుగు నెలల పాటు చేపలకు దూరంగా ఉండి, మన ఆరోగ్యాన్ని అలాగే జలచరాల పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో ఉత్తమం.