
ఏలూరు: ఆధునిక మానవాళి నిత్యం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లకు శాశ్వత పరిష్కారం ధ్యానం, అంతర్మథనమేనని బౌద్ధ తత్వశాస్త్రం నొక్కిచెబుతోంది. ఆ ప్రశాంతతను, ఆధ్యాత్మిక పరిపక్వతను గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం ఒక చారిత్రక ఘట్టానికి వేదికవుతోంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీహార్లోని బుద్ధగయ 'మహాబోధి మహా విహారాన్ని' ప్రామాణికంగా తీసుకుని, అదే ప్రతిరూపంతో ఇక్కడ రూపుదిద్దుకున్న 'బుద్ధ విహారం' దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతోంది.

సామాజిక, ఆధ్యాత్మిక పునాదులతో నిర్మాణం: ప్రధాన బౌద్ధ భిక్షువు 'బంతే అనాలయో' నేతృత్వంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో, ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణం.. కేవలం ఒక కట్టడంగా కాకుండా, బౌద్ధ ధర్మ సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మితమైంది. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే కనిపించే పచ్చని పరిసరాలు, ప్రశాంత వాతావరణం, అత్యంత నైపుణ్యంతో ప్రతిష్ఠించిన దివ్య బుద్ధుని విగ్రహం సందర్శకులను ఆధ్యాత్మిక మైమరపులోకి తీసుకెళ్తాయి. సమాజంలో మత సామరస్యాన్ని, సమభావం పెంపొందించడానికి అవసరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఈ ప్రాంగణం కల్పిస్తోంది.

విజ్ఞాన గనిగా, పరిశోధనా కేంద్రంగా: సాధారణంగా బౌద్ధ విహారాలు కేవలం ప్రార్థనలకే పరిమితం కావు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండ్రాజవరం విహారం కూడా విద్యార్థులు, యువత, పరిశోధకులకు బౌద్ధ తత్వశాస్త్రంపై అవగాహన పెంచే ఒక విజ్ఞాన కేంద్రంగా మారనుంది. బుద్ధుని ప్రధాన సూత్రాలైన అహింస, కరుణ, సమానత్వం, శాంతి వంటి సద్గుణాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేసే శోధనా ప్రాంగణంగా ఇది పనిచేస్తుంది. బుద్ధ పౌర్ణిమ వంటి పర్వదినాల్లో ప్రత్యేక విపస్సన ధ్యాన తరగతులు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చర్చలు ఇక్కడ నిరంతరం నిర్వహించనున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభోత్సవ వేడుకలు: ఈ నెల 28, 29 తేదీలలో గురు పౌర్ణమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ విహార ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత లభించడం విశేషం. శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం దేశాల నుంచి ప్రముఖ బౌద్ధ భిక్షువులతో పాటు తెలుగు రాష్ట్రాలలోని వివిధ బౌద్ధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖుల ఈ వేడుకల్లో భాగస్వామ్యం కాబోతున్నారు.

ఈ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ధ్యాన సమ్మేళనాలు జరుగాతాయి. ఈ ప్రారంభోత్సవంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం, అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ విహారం ఒక దివ్యధామంగా నిలవనుంది.