- Telugu News Photo Gallery Tirupati Food Safety Raids: Expired Ice Creams Seized, Restaurant Sealed Over Unhygienic Conditions
టెంపుల్ సిటీలో ఐస్క్రీమ్లు కొంటున్నారా? అయితే జర భద్రం..! ఎక్స్పైరీ ఐస్క్రీమ్లు, ఎలుకలతో నిండిన కిచెన్లు..
Tirupati Food Safety Raids: తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన సంయుక్త దాడుల్లో పాడైన బాదంపప్పు, గడువు ముగిసిన దాదాపు ఒక టన్ను ఐస్క్రీమ్లు స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రంగా ఉన్న రెస్టారెంట్ను సీజ్ చేసి, సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టారు.
Updated on: Jul 08, 2026 | 11:44 AM

టెంపుల్ సిటీ తిరుపతిలో ఆహార భద్రత నాణ్యతపై జిల్లా యత్రాంగం కొరడా ఝలిపిస్తోంది. మాంసం విక్రయాలు, మల్టీనేషన్ ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీ, అమ్మకాలపై ఇప్పటికే దాడులు నిర్వహిస్తున్న జిల్లా అధికారులు.. ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలు, నిలువ చేసిన గోదాములపై నిఘా పెట్టారు. ఈ మేరకు తిరుపతి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడుల్లో ఎన్నో చేదు నిజాలు బయటపడ్డాయి. కేశవాయనగుంటలోని బాలాజీ ఐస్ క్రీమ్, ఫలుడా తయారీ కేంద్రాల్లో పాడైన బాదంపప్పు, గడువు ముగిసిన కోన్ ఐస్ క్రీములు గుర్తించిన అధికారులు.. పాడైన, కాలం చెల్లిన ఐస్ క్రీములను డంపింగ్ యార్డ్కు తరలించారు. ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను మూసివేసి యాజమాన్యంపై కేసు నమోదు చేసారు.

ఇక బైరాగి పట్టెడ మాషా అల్లా స్టార్ ఫుడ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీలు చేసిన అధికారుల బృందం అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, స్టోర్ రూంలో ఎలుకల సంచారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశుభ్రంగా ఉండాల్సిన ప్రాంతం ఎలుకలు స్థావరంగా ఉన్నట్లు గుర్తించడంతో రెస్టారెంట్ను సీజ్ చేసారు. ఆహార పదార్థాల విక్రయాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్రీజర్లో అపరిశుభ్రంగా నిలువ ఉంచిన ఆహార పదార్దాల వద్ద ఎలుకలు ఉండటాన్ని గుర్తించి హోటల్ సీజ్ చేశారు. నగరపాలక సంస్థ చట్టంలోని సెక్షన్ 492 నుంచి 498 వరకు 521, 541 సెక్షన్ నుంచి 54 6 వరకు, సెక్షన్ 622 అనుసరించి హాటల్ను తాత్కాలికంగా క్లోజ్ చేశారు.

పాత తిరుచానూరు రోడ్డులోని గురు దత్త ఎంటర్ప్రైజెస్ డెయిరీ, స్మూత్ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల్లో తనిఖీ చేసారు. ఎక్స్పైరీ అయినా నిల్వ ఉంచిన టన్ను కోన్ ఐస్ క్రీములు, బాక్స్ ఐస్ క్రీములు, బాల్ ఐస్ క్రీమ్లను సీజ్ చేసారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. నిలువ ఉంచిన దాదాపు ఒక టన్ను కోన్ ఐస్ క్రీములు, బాక్స్ ఐస్ క్రీమ్లు, బాల్ ఐస్ క్రీములు గడువు తేదీ ముగిసినా వాటిని నిల్వ ఉంచి ప్రజల వినియోగానికి ఉంచినట్లు గుర్తించారు. ఈ మేరకు ఒక టన్ను సరుకును స్వాధీనం చేసుకుని పెనాల్టీ విధించారు. ఫుడ్ సెప్టీ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు.

పిల్లలకు వీధులలో, పాఠశాలల వద్ద బండ్లపై లోకల్గా తయారు చేసి విక్రయించే ఐస్ క్రీమలు తినిపించకుండా, పిల్లల ఆహార పదార్థాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాల విషయాలలో ఏదైనా అనుమానం ఉంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు గాని నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర్లు, ఫుడ్ సెప్టీ ఆఫీసర్లు జగదీశ్, నర్మద, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
