ఆహారంలో పీచు లేకపోతే కొలెస్ట్రాల్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు దండెత్తుతాయి. దీంతో మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. బరువు కూడా పెరుగుతారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారం చాలా అవసరం. ఫైబర్ నీటిలో కరిగి ఒక జెల్ను ఏర్పరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలను గ్రహించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ కింది ఆహారాలలో ఫైబర్ అధికంగా లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం..
ఒక కప్పు ఓట్స్లో 1.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వోట్స్ బీటా-గ్లూటెన్లకు గొప్ప మూలం. ఇందులో ఒక రకమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ముంజలు, పప్పులు, కాబూలీ చనా, చిక్పీస్, రాజ్మా వంటి పప్పుల్లో కూడా పీచు అధికంగా ఉంటుంది. రాజ్మా పప్పులో 133 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పప్పులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వెజిటబుల్ ఫుడ్లో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం పప్పులు మాత్రమే.
పీచు లోపం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. దీని నివారణకు అవిసె గింజలు తీసుకోవచ్చు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే శారీరక మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియ పనితీరును నిర్వహిస్తుంది. 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్స్లో 0.6 నుంచి 1.2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అవిసె గింజల మాదిరిగానే చియా గింజల్లో కూడా కరిగే ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి. 1 టీస్పూన్ చియా సీడ్స్లో 24 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
యాపిల్స్లోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్స్లోని ఫైబర్ను పెక్టిన్ అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఆపిల్లో 1 గ్రాము ఫైబర్ ఉంటుంది.
అలాగే క్యారెట్, బ్రోకలీ, కాలే, బచ్చలికూర వంటి కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మంచి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కొలెస్ట్రాల్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎక్కువ కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి.