Whatsapp: వాట్సాప్ యూజర్లు డబ్బులు చెల్లించే సమయం వచ్చేసింది.. ఇకపై ఆ సేవలకు..
వాట్సాప్ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్లో కచ్చితంగా వాట్సాప్ ఉండాల్సిందే అన్న స్థాయికి ఈ మెసేజింగ్ యాప్ ఎదిగింది. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఈ యాప్కు ఇంతటి క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాట్సాప్ ఇప్పటి వరకు తన సేవలకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయడం లేదు. కానీ 2024 నుంచి...
Updated on: Dec 12, 2023 | 9:45 PM

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండగా 2024 నుంచి గూగుల్ డ్రైవ్లో ఫ్రీ అన్లిమిటెడ్ బ్యాకప్లను అందించదని కంపెనీ తెలిపింది.

ఇక నుంచి వాట్సాప్ బ్యాకప్స్కు లిమిటెడ్ స్టోరేజీ కోటా మాత్రమే లభిస్తుంది. గూగుల్ డ్రైవ్లో అందించే 15జీబీ స్టోరేజ్ లిమిట్ మాత్రమే ఉచితంగా అందిస్తారు. అయితే స్టోరేజీ పెంచుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే.

చాట్ బ్యాకప్స్కు గూగుల్ డ్రైవ్లో స్పేస్ కేటాయించే రూల్ 2024 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.26.7లో ఈ విషయాన్ని వివరిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. గూగుల్ డ్రైవ్లో వాట్సాప్ బ్యాకప్లు ఇకపై అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉచితంగా లభించని తెలిపారు.

వాట్సాప్ యూజర్లు ఇకపై తమ బ్యాకప్లను ఉంచుకోవాలనుకుంటే స్టోరేజ్ స్పేస్ మెయింటైన్ చేయాలి. లేదంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం డబ్బులు చెల్లించాలి. యూజర్లు ఎంత స్టోరేజీని ఉపయోగించుకున్నారో తెలియాలంటే.. వాట్సాప్ సెట్టింగ్స్లోని స్టోరేజ్ రివ్యూ ఆప్షన్లో తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉంటే వాట్సాప్ చాట్ బ్యాకప్ స్టోరేజ్ కోసం ఎంత ఛార్జీ వసూలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నట్లు సమాచారం.





























