
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. తులసి మొక్కపై లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు. అందువలన ప్రతి రోజూ తులసి పూజ చేయడం లేదా, తులసి మొక్క నాటడం వలన ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించడమే కాకుండా, కొన్ని సార్లు కొన్ని వస్తువులు సమర్పిస్తుంటారు. కానీ కొన్నింటిని ఎట్టి పరిస్తితుల్లో తులసి మొక్క వద్ద ఉంచకూడదంట.

అదే విధంగా తులసి మొక్కకు శివ పూజకు ఉపయోగించిన ఏ వస్తువు కూడా సమర్పించకూడదు అని చెబుతున్నారు పండితులు. బిల్వ పత్రాలు, పారిజాత పూలు ఇలా ఏవైనా సరే శివుడికి సమర్పించినవి తులసికి సమర్పించకూడదు. ఎందుకంటే, శివుడు తులసి భర్తను చంపడం వలన తులసికి, శివుడికి మధ్య వైరం ఉంటుందంట. అందువలన శివుడికి సమర్పించేవి, తులసి మొక్కకు సమర్పించకూడదంట.

తులసి చెట్టుకు ఎట్టి పరిస్థితుల్లో చెరుకు రసం సమర్పించకూడదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు పండితులు. ముఖ్యంగా తులసి చెట్టుకు చెరుకు రసం సమర్పించడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదంట. అందుకే ఎప్పుడూ కూడా తులసి చెట్టుకు చెరుకు రసం సమర్పించకూడదు.

చాలా మంది తెలిసి, తెలియక తులసి మొక్కకు పాలు కలిపిన నీటిని సమర్పిస్తుంటారు. కానీ ఇది అశుభకరం. తులసి మొక్కకు పాలు కలిపిన నీళ్లు పోయడం ద్వారా మొక్క ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇంటిలో ప్రతికూల శక్తి పెరిగిపోయి, కుటుంబ కలహాలు వంటి సమస్యలు తలెత్తుతాయంట.

అదే విధంగా కొందరు నల్లటి విత్తనాలు, నల్ల నువ్వులు వంటివి తులసి మొక్కకు సమర్పిస్తుంటారు. కానీ ఇది కూడా ప్రతి కూల శక్తులను ఆకర్షిస్తుందంట. అందుకే ఎట్టి పరిస్తితుల్లో నలుపు రంగులో ఉన్న వాటిని తులసి మొక్కకు సమర్పించకూడదంట.