
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం బయలుదేరి యాదాద్రి వెళ్లిన సీజేఐకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద NV రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు.

అనంతరం NV రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదాద్రీశుడికి అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

దర్శనం అనంతరం సీజేఐ ఎన్వీ రమణ ప్రధానాలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు.

ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించారు.