బీదర్ జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. బావులు, బోరు బావుల్లో కూడా నీరు ఎండిపోవడంతో ప్రజలు, జంతువులు, పక్షులు నీటి కోసం అవస్థలు పడుతూ ఉంటారు. అయితే సుక్షేత్ర గయముఖ గుప్తలింగేశ్వరాలయంలోని కొండలో మాత్రం నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా శతాబ్దాలుగా కొండ నుండి నీరు ప్రవహిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఎ సీజన్ లోనూ నీటి ప్రవాహం ఆగలేదు. నీరు ఎక్కడ నుంచి వస్తుంది అనేది మాత్రం నేటికీ ఎవరూ చేధించని రహస్యం.
శివయ్య దర్శనం కోసం ఆంధ్ర, తెలంగాణతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారి దర్శనం కోసం అమావాస్యతో పాటు సోమవారం రోజున భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను చేస్తారు. నేటి నుంచి శ్రావణ మాసం మొదలు ఈ నేపధ్యంలో తొలిరోజే ఈ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే గుప్తలింగ దేవాలయం చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ ఆలయంలోని నీటి ప్రవాహం ఇప్పటి వరకు ఆగిన సందర్భం కానీ ఎండిపోయిన దాఖలాలు లేవు.
ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఈ నీటిలోనే స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ ఉన్న నీటిని ఔషధంగా భావించి రోజూ తాగడం వల్ల శరీరంలోని వ్యాధులు నయమవుతాయని నమ్మకం. ముఖ్యంగా చర్మ వ్యాధులకు ఈ నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇక్కడి నీటిని తాగడం, స్నానం చేయడం వల్ల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
గుహలోని శివలింగం నుంచి ప్రవహించే నీరు కూడా ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ 24 గంటలూ నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ కొండ అంచు నుండి వచ్చే నీరు నంది నుండి కిరు కళ్యాణిలోకి వస్తుంది. నీటి ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చుట్టుపక్కల వారు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం లేని సమయంలో ఇక్కడికి వచ్చి నీటిని నింపుకుని తీసుకుని వెళ్తారు.
ఆలయానికి వెళ్లే భక్తులు కూడా ఇక్కడ ఉన్న నీటిని తీసుకుంటారు. ఈ ప్రదేశం జంతువులు, పక్షుల దాహార్తిని కూడా తీరుస్తుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనే తేడా లేకుండా ఏ సీజన్లో నైనా ఇక్కడ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం రోజున గొప్ప జాతర జరుగుతుంది. ప్రభులింగ స్వామి హిరేమఠ్ పూజారి మాట్లాడుతూ ఈ గుప్తలింగం కొలువై ఉన్న కొండ నీటికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన గుప్తలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది భక్తులు వస్తుంటారు. చారిత్రాత్మకమైన ఈ ఆలయంలోని నీరు భక్తులను ఆకర్షిస్తూ అనేక రోగాలను నయం చేస్తుందని టిబిని నయం చేస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు.