నియమ నిబంధనల ప్రకారం కార్తీక మాసంలో శివుడిని, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎప్పటికీ సంతోషం, విజయం లభిస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, దానాల గురించి మాత్రమే కాదు తినే ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ మాసంలో చేసే జపం, తపస్సు, ఉపవాసం, ధ్యానం మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ జన్మలో భక్తులు నేలపై శయనించి, బ్రహ్మచర్యాన్ని ఆచరించి, దీపదానం చేయడం, తులసి చెట్టును పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పురాణాల పేర్కొన్నాయి.
కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బెండకాయ, పొట్లకాయ, కాకర కాయను అస్సలు తినకూడదు. అలాగే, ఈ పవిత్ర మాసంలో ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లను తినవద్దు. అంతే కాదు ఈ మాసంలో బెల్లం తినడం లేదా దానం చేయడం వల్ల లాభాలు చేకూరుతాయి.
కార్తీక మాసంలో పొరపాటున మాంసాహారం తీసుకోకండి. ఈ సమయంలో చేపలు-మాంసం-గుడ్లతో సహా మాంసాహారం తింటే నరకానికి వెళ్తారని విశ్వాసం. అంతేకాదు ఈ సమయంలో బయటి ఆహారం తినడం మానుకోండి.
కార్తీక మాసంలో ప్రతిరోజూ బెల్లంతినండి. ఇలా బెల్లం తినడం జీర్ణక్రియకు మంచిది. అంతేకాకుండా బెల్లం వాతావరణ మార్పులకు అనుగుణంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. బెల్లం రక్తపోటును నియంత్రిస్తుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ మాసంలో శనగలు, ఆవాలు, పప్పులు తినకండి. అలాగే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రపోకూడదు. ఈ నియమం గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది.
కార్తీకమాసంలో ప్రతిరోజూ తులసి చెట్టుపై దీపం వెలిగించాలి. ప్రతిరోజూ రాత్రి విష్ణువు మరియు లక్ష్మిని పూజించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే.. ఈ మాసంలో తులసి చెట్టు ఎండిపోతే.. కొత్త చెట్టును నాటవచ్చు. దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది.
కార్తీక మాసం ప్రారంభంలో శీతాకాలం చలిని అనుభూతి చెందుతుంది. ఈ సమయంలో ఎలాంటి శీతల పానీయాలు, ఆహారం తీసుకోవద్దు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఈ నియమాన్ని అనుసరించండి.
ఈ పవిత్ర మాసంలో తలకు నూనె రాసుకోవడం కూడా నిషిద్ధం. కార్తీకమాసంలో శరీరానికి నూనె రాసుకోకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. స్నానం కూడా నూనెతో చేయకూడదు. గ్రహదోషం, శని దీనికి కారణం కావచ్చు
కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయడం మంచిది కాదు. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే రోగాలు, పాపాలు రెండూ నశిస్తాయని విశ్వాసం. కార్తీక మాసం నెల రోజులూ చేసే స్నానం వలన భగవంతుడి పట్ల ప్రేమ, సంతోషం కలుగుతాయి. బాధలు తొలగిపోతాయి. జీవితంలోని అన్ని అంశాలలో సామరస్యాన్ని పెంచుతుంది. నెల రోజులూ ఉదయం స్నానం చేయలేకపోతే.. కార్తీక మాసంలోని త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో సూర్యోదయానికి ముందు స్నానం చేయండి. ఇలా చేయడం వలన కార్తీక మాసం అంతా స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని విశ్వాసం.