
ఈ నేపథ్యంలోనే వివాహాలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తల నీలాలు తీయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి ఎలాంటి లౌకిక శుభకార్యాలకైనా ఈ నెల రోజుల పాటు బ్రేక్ పడనుంది. అయితే, లౌకిక కార్యాలకు విరామం ప్రకటించినప్పటికీ, దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు మరియు పూజాదికాలకు మాత్రం ఈ మాసం అత్యంత శ్రేష్ఠమైనదని పండితులు స్పష్టం చేస్తున్నారు.జ్యోతిష్యశాస్త్ర కోణం నుండి పరిశీలిస్తే, ఆషాఢ మాసం దక్షిణాయన ప్రారంభాన్ని సూచించడమే కాక, రాబోయే నాలుగు నెలల పాటు దేవతలు యోగ నిద్రలోకి వెళ్లే చాతుర్మాస వ్రత కాలానికి నాంది పలుకుతుంది.

ఈ నెలలోనే వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 'తొలి ఏకాదశి' (శయన ఏకాదశి) వస్తుంది. ఈ పర్వదినాన శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి జారుకుంటాడని భక్తుల నమ్మకం. దేవతలు నిద్రావస్థకు చేరుకోవడం వల్ల ఈ సమయంలో చేసే శుభకార్యాలకు దైవ ఆశీస్సులు లభించవని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో లౌకిక పరమైన వేడుకల కంటే, పరమాత్మ చింతనతో కూడిన ఉపాసనలు, ఉపవాసాలు, విష్ణుసహస్రనామ పారాయణాలు చేయడం వల్ల విశేష పుణ్య ఫలాలు లభిస్తాయని వేద పండితులు వివరిస్తున్నారు.

ఆషాఢ మాసానికి కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యతే కాకుండా, బలమైన ఆరోగ్య, సామాజిక కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి. వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సంధి కాలంలో సూర్యుని గమనం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల సూక్ష్మక్రిములు, కీటకాలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ రుగ్మతల నుండి రక్షణ పొందేందుకు, ముఖ్యంగా మహిళలు ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని పాటిస్తారు.

గోరింటాకులోని ఔషధ గుణాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, వర్షాకాలంలో వచ్చే చర్మవ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయని పెద్దల నమ్మకం. ఇక సామాజికంగా చూస్తే, వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశంలో ఈ సమయంలో రైతులంతా ఏరువాక సాగిస్తూ సాగు పనుల్లో అత్యంత బిజీగా ఉంటారు. వర్షాల కారణంగా ప్రయాణాలు, శుభకార్యాల నిర్వహణ కష్టంగా మారుతుందనే ఉద్దేశంతో కూడా పూర్వీకులు ఈ మాసంలో వివాహాది వేడుకలను నియంత్రించారు అంతేకానీ ఆషాఢం చెడ్డది కాదని స్పష్టమవుతోంది.

ఈ మాసంలో కొన్ని కఠినమైన సాంప్రదాయక నియమాలు కూడా ఆచరణలో ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన వధువును పుట్టింటికి తీసుకెళ్లడం, దంపతులను ఈ నెల రోజుల పాటు దూరంగా ఉంచడం, అత్తా కోడళ్లు ఎదురుపడకూడదని ఒకే గడప దాటకూడదనే నియమాలు నేటికీ కొనసాగుతున్నాయి. దీని వెనుక కూడా శాస్త్రీయ, వైజ్ఞానిక కోణం దాగి ఉందని పెద్దలు చెబుతారు. ఆషాఢంలో స్త్రీ గర్భం దాల్చితే, సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అంటే ఎండలు తీవ్రంగా ఉండే మార్చి, ఏప్రిల్, మే నెలల మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. అప్పుడే పుట్టిన పసిపాపలకు, బాలింతలకు ఆ తీవ్రమైన వేడి వాతావరణం, ఎండల తీవ్రత శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికీ పాటిస్తున్నారు.