
అసలే అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతుంటే.. పంటను కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కనీసం ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లకు తరలించేందుకు వాహనాలు కూడా దొరకని పరిస్థితి.

లారీల కొరతతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోతోంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా.. రైతు ధాన్యాన్ని తరలించేందుకు వెళ్లిన ఓ ట్రాక్టర్ ఇంజిన్ ను గుర్తితెలియని దుండగులు చోరీ చేసి అన్నదాతకు మరింత షాక్ ఇచ్చారు.

ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం మునిపెళ్లి గ్రామానికి చెందిన నల్ల ప్రభాకర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన రైతు

మొక్కజొన్నల సంచులను తన ట్రాక్టర్ లో వేసుకొని లక్ష్మణచాందలోని మార్కెట్ యార్డ్ కు తీసుకెళ్లారు. హమాలీలు లేకపోవటంతో ట్రాక్టర్ ను అక్కడే ఉంచి ఇంటికి వెళ్లిపోయారు.

గురువారం ఉదయం వచ్చి చూసేసరికి ట్రాలీ ఉండగా ఇంజిన్ లేదు. ఇంజిన్ దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధిత రైతు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా వీడియోల ఆధారంగా విచారణ చేపట్టారు.