Shiva Prajapati |
Updated on: Apr 04, 2021 | 2:30 PM
అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయిజ్ కాలువలో మార్చి 23వ తేదీన భారీ కంటైనర్ నౌక ‘ఎవర్ గివెన్’ ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఇసుక తుఫాను, బలమైన గాలుల కారణంగా నౌక అడ్డం తిరిగి.. దాని ముందుభాగంలో ఉన్న కొమ్ము కాలువ గట్టులో కూరుకుపోయింది.
ఆ నౌకను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్ల ద్వారా తొలగించారు. టగ్ బోట్ల సాయంతో నౌకను కదిలించే ప్రయత్నం చేశారు. ఆరు రోజుల ప్రయత్నం తరువాత ఎట్టకేలకు ఫలితం సాధించారు.
‘ఎవర్ గివెన్’ నౌక సాధారణ స్థితికి రావడానికి మానవ సాంకేతిక ప్రయత్నంతో పాటు.. ప్రకృతి కూడా సాయం చేసింది.
మానవ ప్రయత్నానికి తోడు ప్రకృతి కూడా సహకరించడం వల్లే అంత భారీ నౌక సాధారణ స్థితికి చేరుకుంది. నౌక ముందు భాగం మట్టిలో కూరుకుపోగా.. సిబ్బంది ఆ మట్టిని, ఇసుకను తొలగించారు. అయితే ఆ రోజు ఆదివారం నాడు పౌర్ణమి ప్రభావంతో సూయజ్ కాలువలోకి భారీగా అలలు పోటెత్తాయి. దాంతో ఇసుకలో కూరుకుపోయిన నౌక ఒక్కసారిగా పైకి లేచింది.
సూర్య, చంద్రుల గురుత్వాకర్షణ వల్ల సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి. పౌర్ణమి రోజుల్లో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆదివారం నిండు పౌర్ణమి సందర్భంగా సముద్రంలోని అలలు సూయజ్ కాలువలోకి దూసుకువచ్చాయి. అలా ఆ అలల ధాటి ‘ఎవర్ గివెన్’ షిప్ బయటపడేందుకు ఉపకరించాయి.
ఇటు మానవ ప్రయత్నంలో భాగంగా భారీ క్రేన్లు, ఇతర యంత్ర పరికరాలతో ఇసుకను, మట్టిని తవ్వుతూ.. టగ్బోట్లు సాయంతో నౌకను కదిలించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు పౌర్ణమి చంద్రుడు ఆ భారీ నౌకను కదిలేలా చేయించాయి. మొత్తంగా ఆరు రోజుల ప్రయత్నం తరువాత ఎవర్ గివెన్ షిప్ కదలడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
సముద్రంలో ఏర్పడిన ఆటు పోట్లు ఎవర్ గివెన్ షిప్ బయటకు వచ్చేందుకు సహకరించిందని, అలల పోటు నౌకను బలంగా నెట్టిందని అమెరికా సంస్థ బోస్కోలిస్ వెస్ట్మినిస్టర్ సీఈఓ పీటర్ బెర్డోస్కీ తెలిపారు. ఎవర్ గివెన్ మళ్లీ కదిలిందంటే దానికి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రధాన కారణమని అన్నారు.
ఇక నౌక నీటిపై తేలిన తరువాత కూడా దానిని సాధారణ స్థితికి తీసుకురావడం కూడా చాలా కష్టతరంగా మారిందని పీటర్ తెలిపారు. కాలువ మరో భాగానికి నౌక ఎక్కడ తగులుతుందో అని చాలా కంగారు పడ్డారు. చివరికి ఎవర్ గివెన్కి తాళ్లు కట్టి.. టగ్ బోట్ల సాయంతో సరిచేయగలిగాం అని చెప్పుకొచ్చారు.