
వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ.. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.

సుమారు 500 ఏళ్ల తర్వాత భవ్య మందిరంలో..దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరాడు. ఆ మహోన్నత క్షణాలను వీక్షించిన భక్తజనం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.

రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరించారు. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రాణప్రతిష్ఠ సమయంలో అయోధ్య గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.

ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు రామయ్యకు ప్రత్యేక వస్త్రాలతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామయ్యకు ప్రత్యేక వస్త్రాలను సమర్పించారు.

ఇక రామ్లలా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి మంగళ ధ్వనితో నిరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 50మంది ప్రముఖ కళాకారులు భాగస్వాములయ్యారు.

అయోధ్య నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.