
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మూడు నియోజవర్గాల్లో పర్యటించారు సీఎం జగన్. నరసాపురం, పెదకూరపాడు, కనిగిరి నియోజకర్గాల్లో సీఎం జగన్ రోడ్ షోలకు జనాలు పోటెత్తారు.

పెన్షన్ కోసం వృద్దులు పడుతున్న కష్టం చూసి ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతానన్నారు సీఎం జగన్. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.

మరో 10 రోజుల్లో ఎన్నికలు అనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందన్నారు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎలక్షన్స్ కావన్నారు. మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయిస్తాయన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి చెప్పే మాటలను నమ్మొద్దన్నారు. ఒక వేళ పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమం, అభివృద్ది, పేదలకు అందే లబ్ధి మొత్తం మూలన పడుతుందన్నారు.

గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు అవ్వాతాతలు, వారి కష్టాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చే సరికి అవ్వాతాతలపైన ప్రేమ కలిగిందని, పెన్షన్ రూ. 4000 ఇస్తానంటున్నారన్నారు.

జగన్ పేరు చెబితే కేవలం 5 ఏళ్ల పాలనలోనే అమ్మ ఒడి నుంచి ఆరోగ్య శ్రీ వరకు చాల పథకాలు గుర్తుకొస్తాయన్నారు. అదే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరు అయినా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు.