
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామ చెరువులో ఓ జాలరికి అరుదైన అదృష్టం దక్కింది. గ్రామానికి చెందిన కల్లెడ నగేష్ అనే జాలరి ప్రతిరోజూ లాగే చేపల వేటకై స్థానిక చెరువుకు వెళ్లాడు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చెరువులో చేపలు పట్టేందుకు జాలర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ క్రమంలో నగేష్ వేసిన వలలో ఏదో భారీ జీవి చిక్కినట్లు అనిపించింది. తోటి జాలర్ల సహాయంతో వలను పైకి లాగి చూడగా, అందులో ఏకంగా 26 కిలోల బరువున్న ఒక భారీ చేప కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

సాధారణంగా చెరువుల్లో రెండు, మూడు కిలోల చేపలు పడటం సహజం. కానీ, ఏకంగా 26 కిలోల బరువున్న భారీ చేప చిక్కడంతో ఆ వార్త చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించింది. ఇంత పెద్ద చేపను తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని, అది కూడా మృగశిర కార్తె రోజే ఇలాంటి అరుదైన చేపను చూడటం ఒక అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు.

వింతను చూసేందుకు గ్రామస్థులు, తోటి జాలర్లు చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆ భారీ చేపను తిలకించడానికి, దానితో మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. చుట్టూ పక్కల ఊర్ల నుండి ప్రజలు చెరువు వద్దకు పోటెత్తారు.

వర్షాకాలం ఆరంభంలో వచ్చే మృగశిర సీజన్ జాలర్లకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో చేపల మార్కెట్లో ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. నగేష్ వలలో పడిన ఈ భారీ చేప ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, దానిని దక్కించుకోవడానికి స్థానికులు తీవ్రంగా పోటీ పడ్డారు. తాజా, ఇంత భారీ చేప కావడంతో దీనిని కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు పోటీపడి మరీ వేలం తరహాలో ధర పలికారు. మొత్తానికి మృగశిర వేళ పడ్డ ఈ భారీ చేప ఆ జాలరి కుటుంబంలో పెద్ద సంతోషాన్ని నింపింది.