కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విలయతాండవం చేస్తోంది. దీంతో నిత్యం వేల మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. ఇలాంటి వార్తలు ప్రతి రోజూ మనం వింటూనే ఉన్నాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి దాపురిస్తుందో అర్ధంకాక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటప్పుడు పరిస్థిత్తుల్లో ఉద్యోగులు తమ ఉద్యోగాలను నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ వంటబట్టించుకోవాలని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
నిన్నగాక మొన్నవచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం పని తనాన్ని సమూలంగా మార్చేసింది. దీంతో AI అనేక ఉద్యోగాలకు అంతరాయం కలిగిస్తుందనే భయాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కొత్త టెక్నాలజీల గురించి అప్డేట్ చేసుకోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అలాగే కొత్త ఉద్యోగం పొందడం కూడా చాలా సులభమట. జాబ్ మార్కెట్లో కూడా ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి ద్వారాలు తెరుస్తున్నట్లు చెబుతున్నారు.
సాంకేతికత కొత్త ఆవిష్కరణలు పని గంటలు, పని పద్ధతులలో అచంచలమైన మార్పులను తీసుకురాగలదు. మీరు ఈ మార్పును అంగీకరించి, స్వీకరించే సామర్థ్యం, మనస్తత్వం కలిగి ఉండాలి. ఇలా ఉంటేనే క్లిష్ట సమయాల్లో ధైర్యంగా ఉండగలం.
మునుముందు కాలంలో చాలా పనులు స్వయంచాలకంగా మారతాయి. సాంకేతికత మారుతుంది. కొత్త సాంకేతికతలు వస్తాయి. మీరు ఆ సాంకేతికతలన్నీ త్వరగా నేర్చుకోలేకపోతే, జాబ్ మార్కెట్లో మీరు అనర్హులుగా ముద్రపడిపోతారు!
సహజంగానే, సంస్థ దృష్టిలో ప్రాముఖ్యతకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక్క ఉద్యోగానికే పరిమితం చేసుకోకండి. కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవడంపై దృష్టి పెట్టాలి. ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవాలి. భవిష్యత్తు ఎంత టెక్నాలజీపై ఆధారపడి ఉన్నప్పటికీ, యంత్రాలు మనుషులను ఎప్పటికీ అధిగమించలేవని గుర్తుంచుకోవాలి. కాబట్టి సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు, కొత్త పని, కొత్త ఆలోచనలు, ఇవే శాశ్వతమైనవి.