
చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు భార్యలు ఉంటే పెన్షన్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి విషయాల్లో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు లబ్ధిదారులు మంత్రిత్వ శాఖలు, చట్టపరమైన సలహాలు తీసుకోవాలని తెలిపింది.

ఈ పథకం మార్గదర్శకాల్లోని నియమం 50 ప్రకారం పెన్షనర్ మరణిస్తే అతని భార్య లేదా భర్తకు ఇస్తారు. వారు లేకపోతే, అది అర్హత కలిగిన వారి పిల్లలకు ఇస్తారు, వారు లేకపోతే వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, లేదా వికలాంగులైన సోదరులు/సోదరీమణులకు ఇస్తారు ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

అయితే ఒక ఉద్యోగికి చట్టబద్ధంగా ఇద్దరు భార్యలు, భర్తలు ఉంటే నియమం 50(8)(c) ప్రకారం.. కుటుంబ పెన్షన్ను ఇద్దరు భార్యల మధ్య సమానంగా పంచుకోవాలి, అంటే 50-50. ఇందులో ఎటువంటి గందరగోళం లేదు.

అయితే ఇక్కడ మరో చిక్కుముడి ఉంది. ఇద్దరి భార్యల్లో ఒకరు చనిపోతే.. అప్పుడు మొత్తం పెన్షన్ మిగిలి ఉన్న భార్యకు వస్తుందా అంటే.. అలా రాదు.. చనిపోయిన భార్య పిల్లలకు ఆ పెన్షన్ అందుతుంది.

అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం.. మొదటి వివాహం చెల్లుబాటులో ఉండగా మరో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. ఇది పెన్షన్ రూల్స్ను అతిక్రమించడం అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అర్హతపై తగిన వివాదాలు వస్తాయి. అందుకే శాఖలు ఈ కేసులపై నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించి, చట్ట సలహా తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.