
కరోనా కాలంలో ప్రజల జీవనశైలి చాలా మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దాంతో.. చాలామంది ఎంప్లాయిస్ ల్యాప్టాప్లలో గంటల తరబడి పని చేస్తున్నారు. అయితే, ఇంట్లోనే కూర్చుని పని చేయడం వలన.. చాలా మంది మగాళ్లు అటూ ఇటూ తిరుగుతూ పని చేస్తుంటారు. ఒక్కోసారి తమ ఒడిలోనే ల్యాప్టాప్ పెట్టుకుని పని చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఒడిలో పెట్టుకుని పని చేయడం వలన వారి సంతానోత్పత్తిపై చాలా ప్రభావం చూపుతుందంటున్నారు. అనేక అధ్యయనాలు ఇదే విషయాన్ని నిర్ధారించాయి.

ఒక నివేదిక ప్రకారం.. పురుషులు తమ ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేయడం వారి సంతానోత్పత్తికి హాని కలిగిస్తుందని తేలింది. నిజానికి ల్యాప్టాప్ నుండి విపరీతమైన వేడి వస్తుంది. అవి పురుషుల వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది కాస్తా స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుంది.

ల్యాప్టాప్ నుండి వెలువడే వేడి సంతానోత్పత్తిలో సమస్యలను కలిగిస్తుంది. ఇది పురుషుల స్పెర్మ్పై దుష్ప్రభావం చూపుతుంది. పరిశోధనల ప్రకారం.. ల్యాప్టాప్ నుండి వెలువడే వేడి వ్యక్తి చర్మం, అంతర్గత కణజాలాన్ని పాడు చేస్తుంది. అందుకే మగవాళ్లు ల్యాప్టాప్లు వాడేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

పురుషులు తమ కాళ్లపై లేదా ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని పని చేయడం మానుకోవాలి. ల్యాప్టాప్ నుండి వెలువడే వేడి కారణంగా.. అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండరాల నొప్పి, తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి వంటి అనేక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందంటున్నారు.

మరి ఈ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. మగవారు తమ కాళ్లు, ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని పని చేయడం ఆపేయాలి. దీనికి బదులుగా ల్యాప్టాప్ను టేబుల్పై ఉంచడం ద్వారా పని పూర్తి చేసుకోవాలి.