
జాలరిపేట గాంధీ బొమ్మ వద్ద ఉన్న ఫిషింగ్ హార్బర్ రోడ్డులో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సంప్రదాయ మత్స్యకారులు సామాగ్రి దాచుకునే బడ్డీ దుకాణాల్లో మంటలు చెలరేగి క్షణాల్లో వ్యాపించ్చాయి. ప్లాస్టిక్ వలలకు తీవ్రమైనగాలి తోడై మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో తొమ్మిది బడ్డీలు దగ్ధమయ్యాయి. ఘటన జరిగింది.

వారం రోజుల క్రితం ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగి చాలా పడవలు దగ్ధమైన విషయం మనకు తెలిసిందే. ఈరోజు జరిగిన ప్రమాదంలో సాంప్రదాయ మత్స్యకారులు వినియోగించే వలలు, చిన్న చిన్న తెప్పలు, నాటుపడవల్లో వేట చేసే సామాగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. సకాలంలో మంటలను అదుపు చేశారు. అప్పటికే చిన్నచిన్న పడవల్లో , తెప్పల్లో వేట చేసేందుకు వినియోగించే.. మత్స్యకారుల వలలు, తెడ్లు, కొన్ని ఇంజన్లు కాలిపోయాయి. స్థానికుల సహకారంతో మరికొన్ని షాపులకు మంటలు వ్యాపించకుండా పక్కకు తప్పించ్చారు పోలీసులు.

అయితే.. గతంలోనూ పలుమార్లు ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగినట్టు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. సీపితో స్థానిక మత్స్యకారులు అదే విషయాన్ని చెప్పారు. మరి గతంలో జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేశారా అని వన్ టౌన్ పోలీసులకు ప్రశ్నించారు సిపి. మంటల సమాచారం సకాలంలో ఎందుకు తెలుసుకోలేకపోయారని సిబ్బందిని ప్రశ్నించారు.

తాజాగా జరిగిన ఈ ఘటనతో పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. ఘటనా స్థలికి సిపి రవిశంకర్ అయ్యనార్ చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. సమీపంలోనే అవుట్ పోస్ట్ ఉన్నప్పటికీ.. సకాలంలో మంటలు ఎందుకు గుర్తించలేకపోయారు అన్న విషయంపై సీపి సీరియస్ అయ్యారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

మత్స్యకారులు సామాగ్రి దాచుకునే బడ్డీల్లో మండలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా..? ఆకతాయిలపనా..? కుట్ర కోణం ఉందా.. అన్న విషయంపై పోలీసులు అరా తీస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు. యాక్సిడెంటల్ ఫైర్గా ఎఫ్ ఐ ఆర్లో రికార్డ్ చేశారు. షాపుల్లో వలలు, తెడ్లు, మరికొన్ని పరికరాలు దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని మత్స్యకారులు ఫిర్యాదు చేశారు.