
భానుడి భగభగలు ఇప్పట్లో తగ్గేలా లేదు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటి పోతున్నాయి. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి సాధారణంగా చల్లని నీళ్లు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, రిఫ్రిజిరేటర్ నీళ్లు తాగితే మాత్రం సమస్యలను ఆహ్వానించినట్లే.

కానీ రిఫ్రిజిరేటర్ లేకుండా కూడా సహజంగా ఇంట్లోనే చల్లని నీటిని తాగొచ్చు. పూర్వపు రోజుల్లో మన అమ్మమ్మలు, నానమ్మలు పాటించిన పద్ధతే. ఫ్రిజ్ లేకుండానే వీరు నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలు, కుంజోలను ఉపయోగించారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది వేసవిలో ఉపశమనం పొందడానికి ఆ పాత పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కుంజో నీరు సాధారణంగా చల్లగా ఉంటుంది. పైగా ఎటువంటి శారీరక సమస్యలు వచ్చే ప్రమాదం కూడా లేదు.

మట్టికుండలోని చల్లని నీరు ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. అయితే నీటిని కుండలో నింపుకునే ముందు సరిగ్గా శుభ్రం చేయకపోతే మాత్రం పలు సమస్యలను కలిగిస్తుంది. మీరూ మట్టికుండను వినియోగిస్తున్నట్లైతే దానిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

దుకాణం నుండి కుండను కొనుగోలు చేసిన తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అందుకు సబ్బును వినియోగించ కూడదు. కుండను శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, చేతితో బాగా కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కుండ మూలలో ఉన్న మురికి బయటకు వస్తుంది.

ఆ తర్వాత ఈ కుండలో నీటిని నింపి గదిలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. కుండ చుట్టూ తడి గుడ్డ చుట్టి ఉంచితే మట్టి కుండలోని నీరు రిఫ్రిజిరేటర్లోని నీరు మాదిరి చల్లగా ఉంటుంది.