
వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది శీతల పానియాలు తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. ఎండ కారణంగా అధిక చెమట, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ క్షీణత వంటి సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి . అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. నిజం.. చిటికెడు ఉప్పుకు అంత శక్తి ఉంది మరి.

గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా చెమటలు పట్టినప్పుడు శరీరం నుండి ముఖ్యమైన ఖనిజాలు పోతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గితే డీహైడ్రేషన్, దాహం, మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం మంచిది.

ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు, ముఖ్యంగా అధికంగా చెమట పట్టేవారు, వ్యాయామం చేసేవారు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రజలు ఈ అలవాటును పెంచుకునేటప్పుడు, ఉప్పులోని సోడియం కంటెంట్ శరీరం నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఇది డీహైడ్రేషన్, అలసట సమస్యలను తగ్గిస్తుంది. ఇది కండరాలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.

అందువల్ల, కండరాల నొప్పులు, నరాల ఒత్తిడి సమస్యలు ఎదురైతే ఉప్పునీరు తాగడం చాలా మంచిది. అదనంగా, ఆహారం త్వరగా జీర్ణం కానప్పుడు, అది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఉప్పునీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్ల స్థాయిలు సరైన స్థాయిలో ఉండటం, జీర్ణక్రియ మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది.

చిటికెడు ఉప్పు కలిపిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఇది అందరికీ మంచిది కాదు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉప్పునీరు తాగకూడదు. ఉప్పు తీసుకోవడం పెరగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఉప్పునీరు తాగాలి.