
దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ వేదికగా సంచలన బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఐర్లాండ్ పర్యటనలోనే ఈ యువ కిరణం బరిలోకి దిగుతాడని అభిమానులు ఆశించినా, అతడు కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. పదే పదే అద్భుత ప్రదర్శన చేస్తున్నా ఈ వండర్ కిడ్ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వెనుక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారత జట్టులో ప్రస్తుతానికి ఓపెనింగ్ స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులైన విద్వంసకర ఆటగాళ్లు జట్టులో అందుబాటులో ఉండటంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కడం చాలా కష్టంగా మారింది. ఐర్లాండ్ పర్యటనలో ఓపెనర్లు వరుసగా విఫలమైనప్పటికీ, కోచ్ గౌతమ్ గంభీర్ పాత ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచారు. ప్రస్తుతానికి జట్టు సమతుల్యతను దెబ్బతీయడం గంభీర్కు ఇష్టం లేదు. అందువల్ల ఈ యువ ఓపెనర్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ శైలితో అందరినీ ఆకట్టుకున్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకోవడానికి అతడికి దేశవాళీ క్రికెట్లో ఇంకాస్త అనుభవం కావాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటివరకు అతడు కేవలం 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడి 207 పరుగులు చేశాడు. అలాగే 13 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 564 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలను పరిశీలిస్తే, అతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ముందు దేశవాళీ క్రికెట్లో మరింత రాటుదేలాలని, మరికొన్ని భారీ ఇన్నింగ్స్లు ఆడాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన కఠినమైన నిర్ణయాలకు, ఎంపిక విధానానికి పేరుగాంచారు. బయటి నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, జట్టు ప్రయోజనాలే పరమావధిగా ఆయన అడుగులు వేస్తారు. ఐర్లాండ్ సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఘోరంగా విఫలమైనప్పటికీ, గంభీర్ తన వ్యూహాన్ని మార్చుకోలేదు.

యువ ఆటగాడిని నేరుగా మైదానంలోకి దించి మరింత ఒత్తిడికి గురిచేయడం ఆయనకు ఇష్టం లేదు. ఇదే కారణం చేత రాబోయే ఇంగ్లండ్తో జరగబోయే అత్యంత కీలకమైన సిరీస్లో కూడా వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుందని స్పష్టమవుతోంది.