టీమిండియాకు మరో యువ ఆటగాడు దొరికేశాడు. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు యువ క్రికెటర్ల చేతుల్లో ఉందని చెప్పేలా.. ఐపీఎల్లో అన్క్యాప్ద్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. కేకేఆర్ ఇప్పటికే రింకూ సింగ్ను పరిచయం చేయగా.. ఇప్పుడు మరో యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ తెరపైకి వచ్చాడు.
విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో, కేకేఆర్ తరపున వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన అంగ్క్రిష్ రఘువంశీ.. అద్భుతమైన బ్యాటింగ్తో దుమ్ములేపాడు. బరిలోకి దిగగానే.. ఎదుర్కున్న రెండో బంతికి బౌండరీ కొట్టి.. తన దూకుడైన ఆటతీరును కనబరిచాడు రఘువంశీ.
ఢిల్లీ టీంలోని అనుభవమున్న మార్ష్, నోర్తెజా, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ లాంటి బౌలర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కుని.. కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఐపీఎల్లో తన ఆగమనాన్ని ప్రకటించాడు.
ఢిల్లీకి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ.. దేశవాళీ క్రికెట్లో ముంబై తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో అండర్-19 ప్రపంచకప్నకు టీమిండియా తరపున బరిలోకి దిగాడు. 2023లో లిస్ట్-ఏ, దేశవాళీ టీ20ల్లో అరంగేట్రం చేశాడు రఘువంశీ. సీకే నాయుడు ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో రఘువంశీ కేవలం 9 మ్యాచ్ల్లో 765 పరుగులు చేసి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.
ఈ క్రమంలోనే కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్.. ఐపీఎల్ 2024 మినీ వేలంలో రఘువంశీను గాలం వేసి మరీ పట్టుకున్నాడు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా.. ఈ 18 ఏళ్ల ప్లేయర్ ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లో అంగ్క్రిష్ రఘువంశీ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అదరగొట్టాడు.