భారత క్రికెట్లో మిథాలీ రాజ్ శకం ముగిసింది. భారత మహిళల క్రికెట్లో ఎక్కువ గుర్తింపు పొంది, అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ.. కొన్ని రోజుల క్రితం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయినప్పటికీ, ఆమె పేరు మీద ఇప్పటికీ భారత క్రికెట్లో చాలా రికార్డులు ఉన్నాయి. అలాంటి ఒక రికార్డ్ను మరో వెటరన్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బద్దలు కొట్టింది.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో అత్యధిక టీ20 పరుగుల మిథాలీ రాజ్ రికార్డును హర్మన్ప్రీత్ కౌర్ బద్దలు కొట్టింది. హర్మన్ప్రీత్ శ్రీలంకతో జరిగిన రెండు వరుస మ్యాచ్లలో 31, 39 పరుగులు చేసింది. తద్వారా మహిళల టీ20లో భారతదేశం తరపున అత్యంత విజయవంతమైన బ్యాట్స్మెన్గా మిథాలీని అధిగమించింది.
హర్మన్ప్రీత్ కౌర్ 124 మ్యాచ్లలో 111 ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలతో 2411 పరుగులు చేసింది. ఆమెకు ముందు, మిథాలీ రాజ్ 89 మ్యాచ్లలో 84 ఇన్నింగ్స్లలో 2364 పరుగులు చేసింది. అందులో ఆమె 17 అర్ధ సెంచరీలు చేసింది. మిథాలీ 3 సంవత్సరాల క్రితం తన చివరి టీ20 మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఈ రికార్డు ఆమె పేరు మీద ఉంది.
ఈ ఇద్దరి తర్వాత, ప్రస్తుత కాలంలో అతిపెద్ద సూపర్ స్టార్ బ్యాట్స్మెన్గా నిలిచిన స్మృతి మంధాన మూడో స్థానంలో నిలిచింది. ఎడమచేతి వాటం కలిగిన దూకుడైన ఓపెనర్ 86 మ్యాచ్లలో 84 ఇన్నింగ్స్లలో 14 అర్ధ సెంచరీలతో సహా 2011 పరుగులు సాధించింది.
కాగా, మహిళల క్రికెట్లో అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డ్ న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్మెన్ సుజీ బేట్స్ పేరిట ఉంది. బేట్స్ 126 మ్యాచ్ల్లో 123 ఇన్నింగ్స్ల్లో ఒక సెంచరీ, 21 హాఫ్ సెంచరీలతో 3380 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.