కెప్టెన్గా, వ్యక్తిగతంగా ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో క్రికెట్ నిపుణుల నుంచి అభిమానుల వరకు అందరి చేత మాటలు పడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో జట్టుకు అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ పాండ్యా అటు బ్యాట్, ఇటు బంతితో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో పాండ్యా ఆల్ రౌండర్ ఆటతో జట్టు విజేతగా నిలిచాడు.
మొదట బ్యాటింగ్లో కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లతో 50 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు బౌలింగ్ లోనూ రాణించిన హార్దిక్ 3 ఓవర్లలో 32 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. సెమీఫైనల్కు ముందు టీమ్ఇండియా ఆందోళన ఏమిటో వెల్లడించాడు. జట్టు లోటు గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. జట్టుగా మనం చాలా రంగాల్లో మెరుగవ్వగలం. మనం వికెట్లు కోల్పోయే విధానాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు.
దీని వల్ల జట్టు మెరుగైన ప్రదర్శన చేయగలదు. మేం నిజంగా గొప్ప క్రికెట్ ఆడాం. వ్యక్తిగతంగా జట్టులోని ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేశారు. తమ పనిని కూడా నీట్గా పూర్తి చేశామని తెలిపాడు.
ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 146 పరుగులకే పరిమితమైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు సెమీఫైనల్ కల చెదిరిపోయింది.