'అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని' అన్నట్టుగా తయారయ్యింది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఐపీఎల్ 2024లో ఆడిన మూడింటిలోనూ మూడు మ్యాచ్లు ఓడిపోయి.. అట్టడుగు స్థానంలో ఉంది ముంబై. స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. అంతర్గత గొడవలే.. ఈ ఓటములకు కారణమని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు గుసగుసలాడుతున్నారు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు సారధ్య బాధ్యతలను చేపట్టాడు హార్దిక్ పాండ్యా. ఇక మొదటి నుంచి అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ని మోసం చేసి.. హార్దిక్ కెప్టెన్సీ లాక్కున్నాడని తిట్టిపోస్తున్నారు.
వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయినా.. మొన్న రాజస్తాన్ మ్యాచ్లో చిత్తుగా ఓటమిపాలయ్యేసరికి.. మరోసారి హార్దిక్ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. రోహిత్కే జట్టు పగ్గాలు అప్పగించాలన్న చర్చ మొదలైంది.
ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. 'హార్దిక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో అది స్పష్టమైంది. అంతకముందు రెండు మ్యాచ్ల్లో పాండ్యా బౌలింగ్ వేశాడు.
కానీ ఈసారి పోటీకి దిగలేదు. ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్కి మ్యాచ్ ఉంది. ఆలోపే ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకుని.. మళ్లీ రోహిత్ను కెప్టెన్ చేస్తుందని నా అభిప్రాయం'. అని అన్నాడు.