ఐపీఎల్ 2024 ముగిసింది. లీగ్ అంతటా నిలకడైన ఆటతీరు కనబరిచిన కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. కీలకమైన మ్యాచ్లో SRH బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 2 వికెట్ల తేడాతో చేదించి ఘన విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే.. ఓ ఆసక్తికర పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. అప్పుడు డబ్ల్యూపీఎల్.. ఇప్పుడు ఐపీఎల్లో ఒకే లాంటి సీన్ రిపీట్ అయిందని నెటిజన్లు అంటున్నారు. ఆ సెంటిమెంట్ను ప్రామాణికంగా తీసుకుని.. ఆస్ట్రేలియా కెప్టెన్లే తమ జట్లకు ఐపీఎల్ ట్రోఫీలు అందించలేకపోయారని చెబుతున్నారు.
డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ సాధిస్తారని అనుకుంటే.. అనూహ్యంగా 113 పరుగుల స్వల్ప స్కోర్కు ఆలౌట్ అయ్యారు. ఇక బెంగళూరు ఉమెన్స్ జట్టు ఆ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి.. చేధించి.. డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందుకుంది.
సరిగ్గా ఐపీఎల్లోనూ ఇదే జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక హైదరాబాద్ జట్టు కూడా 113 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్కతా జట్టు కూడా బెంగళూరు తరహాలోనే రెండు వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని చేధించింది. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది.
ఇదంతా చూస్తే.. ఆస్ట్రేలియా కెప్టెన్లకు డబ్ల్యూపీఎల్, ఐపీఎల్ అస్సలు కలిసిరాలేదు. డబ్ల్యూపీఎల్ లీగ్ స్టేజిలో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ములేపింది. ఇటు ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్ధులపై విరుచుకుపడింది. సరిగ్గా ఫైనల్ చేరేసరికి రెండు జట్లు ఓటమిపాలయ్యాయి. రెండు జట్లూ పిచ్ను సరిగ్గా అంచనా వేయకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశాయని నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.