
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (ఏప్రిల్28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లీగ్ లో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీకి ఇది 3వ విజయం.

గుజరాత్ ఇచ్చిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీలో ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయంగా 70 పరుగులు చేయగా, వన్ డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ 41 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించాడు.

మొత్తం 10 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీ సాధించిన జాక్స్ తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు. ఆర్సీబీ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

జాక్స్ కంటే ముందు, క్రిస్ గేల్ 2013లో పూణె వారియర్స్ ఇండియాపై కేవలం 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు జాక్స్ 41 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానం కైవసం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్లో తొలి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్స్ మిగిలిన 50 పరుగులను కేవలం 10 బంతుల్లోనే పూర్తి చేశాడు. తద్వారా అర్ధ సెంచరీకి సెంచరీని పూర్తి చేయడానికి అతి తక్కువ బంతులు తీసుకున్న బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు జాక్స్.

దీంతో పాటు ఈ మ్యాచ్లో 10 సిక్సర్లు బాదిన జాక్స్.. RCB తరఫున ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి నాన్ ఓపెనర్ బ్యాటర్ గా నిలిచాడు.