
India vs Afghanistan ODI Squad 2026: ముల్లాంపూర్లో అఫ్గానిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సెలవు ప్రకటించినట్లుగా టీమిండియా కేవలం మూడు రోజుల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో సరికొత్త రికార్డు సృష్టించిన శుభ్మన్ గిల్ సేన, అదే ఊపుతో వన్డే సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. అయితే తొలి వన్డే షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ముందుగా నిర్ణయించిన జూన్ 14వ తేదీ కంటే ఒక రోజు ముందుగానే, అంటే జూన్ 13న ధర్మశాలలో మొదటి వన్డే జరగనుంది. మిగిలిన రెండు మ్యాచ్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదు. జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో చివరి వన్డే మ్యాచ్ జరగనున్నాయి.

టెస్ట్ జట్టు నుంచి ఆరుగురు అవుట్: రెండు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసిన సెలెక్టర్లు, టెస్టులో ఆడిన కొందరు ఆటగాళ్లను వన్డే సిరీస్ నుంచి తప్పించారు. ముల్లాంపూర్ టెస్టులో భాగమైన సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, ధ్రువ్ జురెల్ వన్డే జట్టులో చోటు కోల్పోయారు. వాస్తవానికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ జాబితాలో ఉండాల్సిందే, కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి వెనుక భాగంలో నరాల నొప్పితో (హామ్స్ట్రింగ్ గాయం) వన్డే సిరీస్ మొత్తానికి దూరం కావడంతో జైస్వాల్కు అదృష్టం వరించింది. కోహ్లీ స్థానంలో జైస్వాల్ను వన్డే జట్టులోకి కొనసాగించారు.

పరిమిత ఓవర్ల స్పెషలిస్టుల ఎంట్రీ: టెస్ట్ జట్టు నుంచి ఆరుగురు దూరం కాగా, వారి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని రికార్డు ఉన్న ఆరుగురు ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అలాగే టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టుతో చేరాడు. ట్వంటీ20 సిరీస్ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, చాలా కాలం తర్వాత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. వీరితో పాటు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వన్డే సిరీస్లో తమ సత్తా చాటనున్నారు.

రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్న తొమ్మిది మంది వీరే: టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్లోనూ తమ స్థానాలను పదిలపరుచుకున్న ఆటగాళ్లు తొమ్మిది మంది ఉన్నారు. రెండు ఫార్మాట్లకు సారథిగా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ గాయం కారణంగా అనూహ్యంగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే ఈ రెండు జట్లలోనూ సెలెక్ట్ అయ్యారు. రోహిత్, హార్దిక్ వంటి అనుభవజ్ఞులు, గిల్, జైస్వాల్ వంటి యువ రక్తం కలవడంతో భారత జట్టు సమతూకంగా కనిపిస్తోంది.

అఫ్గానిస్తాన్తో జరగబోయే ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారనుంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో పటిష్టంగా ఉన్న భారత జట్టు, టెస్టుల్లో చూపించిన ఆధిపత్యాన్ని వన్డేల్లోనూ ప్రదర్శించి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ధర్మశాల వేదికగా జూన్ 13న జరిగే తొలి పోరులో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి.

అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ కోసం భారత పూర్తి జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.