
పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత దేశంలో టాలీవుడ్ నెంబర్ వన్ అయిపోయింది. బాలీవుడ్ కూడా మనకంటే వెనకాలే ఉంది. ఒకవేళ ఓడిస్తే తమిళం లేదంటే హిందీ ఇండస్ట్రీలకు మాత్రమే సాధ్యమనుకున్నారు. ఇన్నాళ్లూ వాళ్లే పోటీ అనుకున్నారు. మలయాళం, కన్నడ ఇండస్ట్రీలను అయితే పూర్తిగా లైట్ తీసుకుంటాం మనం.

యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజియఫ్ తర్వాత కన్నడ రేంజ్ పెరిగింది. వాళ్ల నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. కేజియఫ్ 2 చిత్రం దాదాపు 1200 కోట్లు వసూలు చేస్తే.. చిన్న సినిమాగా వచ్చిన కాంతార 400 కోట్ల క్లబ్లో చేరింది.

అయితే కేరళ ఇండస్ట్రీ మాత్రం వెనకే ఉందనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా మాలీవుడ్ రేసులోకి వచ్చేస్తుంది. వాళ్ల సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. తాజాగా మలయాళ సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. ఇటీవల వచ్చిన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

2024ని సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ బాగానే మొదలుపెట్టింది. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా మూడు కలిపి 500 కోట్లకు పైగా వసూలు చేసాయి. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఫిబ్రవరి పూర్తిగా ఫ్లాప్.. మార్చిలోనూ భీమా, టిల్లు స్క్వేర్ మాత్రమే చెప్పుకోదగ్గవి.. ఎప్రిల్లో ఫ్యామిలీ స్టార్ రానుంది. కానీ వీటన్నింటికీ ఎన్నికలతో పాటు IPL టెన్షన్ ఉంది.

మలయాళ సినిమాకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుందిప్పుడు. మమ్ముట్టి భ్రమయుగం 100 కోట్లకు పైగా వసూలు చేస్తే.. ప్రేమలు, మంజిమల్ బాయ్స్ అదే చేసి చూపించాయి. కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే.. తాబేలు కుందేలు కథలా టాలీవుడ్ను మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. మనకంటే తోపుల్లేరు అని ఫీలవుతున్న తెలుగు ఇండస్ట్రీకి అంతకంటే ఘోర అవమానం మరోటి ఉండదు.