అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. ముంబైలోనే ఉంటూ.. సౌత్ సినిమాలను కూడా సెట్ చేస్తున్నారు సాయి పల్లవి. అసలిన్ని ఇండస్ట్రీలను ఈ బ్యూటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..?
ఆ మధ్య ఏడాది పాటు సినిమాలే చేయలేదు సాయి పల్లవి. దాంతో ఎందుకు ఈ గ్యాప్ అనుకున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పుడేమో అస్సలు గ్యాప్ లేకుండా వరస సినిమాలు చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు.
అన్ని ఇండస్ట్రీల్లోనూ జెండా పాతేస్తున్నారు న్యాచురల్ బ్యూటీ. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూతో ఈమె నటిస్తున్న రెండో సినిమా ఇది.
మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరన్లో నటిస్తున్నారు. ఈ చిత్ర డబ్బింగ్ పనులు ముంబైలోనే పూర్తి చేస్తున్నారు సాయి పల్లవి. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి.
అక్కడ ఇప్పటికే అమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. రణ్బీర్ కపూర్ రామాయణలోనూ సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూట్ ముంబైలోనే జరుగుతుంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారి దీనికి దర్శకుడు. మొత్తానికి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. గ్లామర్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు సాయి పల్లవి.