పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ నిర్మాతలు కలవడం బాగానే ఉంది.. ఇండస్ట్రీ సమస్యలతో పాటు అన్ని విషయాల గురించి చర్చ బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ విషయం మాత్రం ఎవరికీ అంతు చిక్కట్లేదు. చిరంజీవి విషయంలో చేసిన పొరపాటే పవన్ విషయంలోనూ ఇండస్ట్రీ చేస్తుందా..? లేదంటే అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకుంటుందా..?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగు సినిమా నిర్మాతల భేటీ.. గంటకు పైగానే సాగిన చర్చలు..! టాలీవుడ్లో ఇదే హెడ్ లైన్ ఈరోజు. ఎవర్ని కదిపినా.. ఎక్కడ కదిలించినా దీనిపైనే చర్చ. పవన్ కళ్యాణ్ను తెలుగు సినిమా నిర్మాతలంతా ఒకేసారి కలవడంపై ఎంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
అయితే వాళ్లు మాత్రం కేవలం అభినందించడానికే అంటున్నారు. పవన్కు సన్మానం అనేది బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ విషయం చిరంజీవి ఫ్యాన్స్ను బాగా కలవరపెడుతుంది.. ఇంకా చెప్పాలంటే బాధ పెడుతుంది కూడా.
ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినపుడు కూడా ఇలాగే మీడియా ముందుకొచ్చి ఇండస్ట్రీ అంతా కలిసి చిరుకు సన్మానం చేస్తాం.. అభినందన సభ పెడతాం అన్నారు. కానీ అది మాటల వరకే పరిమితమైపోయింది. అభినందన సభ మాటని ఇండస్ట్రీ పెద్దలు గాలికి వదిలేసినా.. అదే పెద్దలను పిలిచి గ్రాండ్గా పార్టీ ఇచ్చి నాన్నకు బహుమతి ఇచ్చారు రామ్ చరణ్.
తాజాగా పవన్ డిప్యూటీ సిఎం అయినందుకు.. అభినందన సభ పెడతాం అంటున్నారు. ఇది నిలబెట్టుకునేలాగే కనిపిస్తున్నారు.. ఎందుకంటే ఆ ప్రభుత్వంతో పని పడుతుంది కాబట్టి. మొత్తానికి అప్పుడు చిరంజీవికి దక్కని గౌరవం.. ఇప్పుడు తమ్ముడికి దక్కుతుందన్నమాట.