
సెప్టెంబర్ నెల ప్యాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా చాలా కీలకం. వెయ్యి కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దిగుతున్న సినిమాలు కొన్ని అయితే, ఎలాగోలా హిట్ మూవీ అనిపించుకోవాలన్న ఎయిమ్తో వస్తున్నవి మరి కొన్ని. రామ్పోతినేనితో మొదలుపెడితే నవీన్ పొలిశెట్టి వరకు... చాలా మంది సెలబ్రిటీలు ఈ నెల మీద హోప్స్ పెట్టుకున్నారు. ఒక్క హిట్ కావాలి అంటున్న ఆ ఆర్టిస్టులెవరు? చూసేద్దాం రండి...

రామ్పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా స్కంద. సెప్టెంబర్ 15న రిలీజ్కి రెడీ అవుతోంది. మాంచి హిట్ ఒకటి పడాలని గట్టిగా కోరుకుంటున్నారు రాపో. తన ఇమేజ్ మార్చి ఇస్మార్ట్ శంకర్తో సరికొత్త లైఫ్ ఇచ్చిన మాస్ జోనర్నే మళ్లీ నమ్ముకున్నారు. మాస్ కాన్సెప్టులు బోయపాటి చేతిలో ఎలా ఎలివేట్ అవుతాయో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు స్కంద సినిమా ట్రైలర్ చూసిన వారికి ఆ విషయం మరోసారి అర్థమైంది. రామ్ పోతినేని - బోయపాటి శ్రీను ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అవుతోంది స్కంద. హీరోకీ, డైరక్టర్కీ ఇద్దరికీ ఈ సినిమా హిట్ చాలా కీలకం.

ఉత్తరాది నటి అయినా సరే, దక్షిణాదిన మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తున్నారు కంగనా రనౌత్. ఈ సారి ఆమె చంద్రముఖి2లో నటించారు. జ్యోతికతో సహా చంద్రముఖి కాన్సెప్ట్ లో నటించిన నటీమణులు అందరూ ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. వాళ్లలా కంగనా రనౌత్ గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తారా? చంద్రముఖి రేంజ్లో చంద్రముఖి2 ఆకట్టుకుంటుందా? అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. ఈ సినిమా హిట్ మీద లారెన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు.

విశాల్ హిట్ చూసి చాన్నాళ్లయింది. ఒక్క హిట్ పడితే మళ్లీ కోలుకుని వరుస సినిమాలు చేసుకుంటాననే ఫీలింగ్లో ఉన్నారు విశాల్. అందుకే సెప్టెంబర్ 15 కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు విడుదలయ్యే మార్క్ ఆంటోనీ పీరియాడిక్ మూవీగా తెరకెక్కింది. పక్కా కమర్షియల్ సినిమా అని అంటున్నారు విశాల్.

రీఎంట్రీలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ చేశారు అనుష్క. బాహుబలి అంతటి చరిష్మా మళ్లీ కనిపించాలంటే ఈ సినిమా సక్సెస్ ఆమెకి చాలా కీలకం. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కూడా యు/ఎ ఇచ్చింది. సెప్టెంబర్ 7న జవాన్తో పోటీపడుతోంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. హీరో నవీన్ పొలిశెట్టి కూడా ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.