
తెలుగు చిత్రపరిశ్రమలో వినూత్న చిత్రాలను తెరకెక్కించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాగే స్టార్ హీరోలతో ప్రయోగాలు చేసిన డైరెక్టర్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే అప్పట్లోనే సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సింగీతం శ్రీనివాసరావు సైతం.. నందమూరి బాలకృష్ణతో ఓ ప్రయోగం చేశారు. అయితే ఆ సినిమా కోసం బాలయ్య దాదాపు 11 రోజులు అన్నం మానేయాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు భైరవ ద్వీపం. డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ సినిమా కోసం బాలయ్య చేసిన సాహసం మాముల్ది కాదనే చెప్పాలి. రాకుమారి కోసం తన అందం చెదిరిపోయే పాత్రలో నటించారు. అప్పటికే స్టార్ హీరో.. అయినప్పటికీ సినిమా కోసం ఏకంగా కురూపి పాత్రలో కనిపించారు బాలకృష్ణ. ఈ విషయం ముందుగా డైరెక్టర్ చెప్పినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒకే చెప్పేశారట.

కురూపి పాత్రలో బాలయ్య నటన నుంచి మిగతా నటులు, ప్రేక్షకులు అంతా షాకయ్యారు. భైరవ ద్వీపం చిత్రంలోని కురూపి పాత్ర కోసం మేకప్ వేయడానికి రెండు గంటల సమయం పట్టేదట. మళ్లీ తీసేయడానికి మరో రెండు గంటలు పట్టేదట. అయితే భోజనం సమయం వచ్చినప్పుడు ఈ గెటప్ ను తీసేవారు కాదట బాలయ్య. మేకప్ తీసి, వేయడానికి సమయం చాలా పడుతుండడంతో ఆయన ఆహారాన్ని తీసుకోవడం మానేశారట. కేవలం జ్యూస్ మాత్రమే తాగుతూ ఉన్నారట.

దాదాపు 11 రోజుల పాటు ఆహరం తీసుకోకుండా కేవలం జ్యూస్ మీదనే ఆధారపడి కురూపి పాత్రలో జీవించేశారు బాలయ్య. ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఇందులో కథానాయికగా రోజా నటించారు. ప్రత్యేక పాత్రలో రంభ నటించింది. ఈ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఇలాంటి జానపద చిత్రం మరొకటి రాలేదని అంటుంటారు.

కురూపి పాత్రను హీరో తర్వాత అతడి తల్లి వేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కేఆర్ విజయను అడగ్గా.. హీరోనే కురూపిగా కనిపిస్తుంటే నాకు వేయడానికి ఏం అభ్యంతరం చెప్పండి అని ఆమె సైతం ఈ వేషం వేయడానికి ఒప్పుకున్నారు. తన తల్లిని కాపాడుకోవడానికి వస్తున్న సమయంలోనే నీళ్లలో ఉన్న ముళ్లు బాలయ్య కాలిలోకి దిగబడిపోయాయి. రాళ్లు గుచ్చుకున్నాయి. అయినా అవేమీ లెక్కచేయకుండా షూటింగ్ కంప్లీట్ చేశారు బాలకృష్ణ. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.