
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వెంకటేశ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ అడియన్స్ లో వెంకీ మామ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అయితే మీకు తెలుసా.. పదవ తరగతి అమ్మాయితో వెంకీమామ తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. సాధారణంగా సినీరంగంలోకి హీరోయిన్స్ చిన్న వయసులోనే ఎంట్రీ ఇస్తుంటారు. అటు చదువు.. ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఎంతో మంది కొత్త హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశారు వెంకటేశ్.

కానీ పదవ తరగతి అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి వెంకీ తీసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే బొబ్బిలి రాజా. ఈ చిత్రంలో వెంకటేష్ జోడిగా హీరోయిన్ దివ్యభారతి నటించింది. 35 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇది వెంకటేష్ తొలి రజతోత్సవ చిత్రం కూడా.

వెంకటేష్ నటన, బి గోపాల్ దర్శకత్వం, ఇళయరాజా పాటలు, దివ్య భారతి గ్లామర్ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఈ సినిమాతో దివ్య భారతి తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు. అప్పుడు ఆమె 10వ తరగతి పరీక్షలు రాస్తోంది. ఈ సినిమా తర్వాత దివ్య భారతి అదృష్టం మారిపోయింది.

తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీ అల్లుడు', 'ధర్మ క్షేత్రం', 'చిట్టెమ్మ మొగుడు', 'తొలి ముద్దు' వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 19 ఏళ్ల వయసులోనే అనుహ్యంగా మరణించింది. ఆమె 5వ అంతస్తు బాల్కనీ నుండి పడి మరణించింది. ఆమె మరణానికి కారణం నేటికీ మిస్టరీగానే ఉంది.