
సంక్రాంతికి విడుదలైంది త్రివిక్రమ్ గుంటూరు కారం. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై నెల దాటినా, ఇంకా ఏదో ఒక మంచి రీజన్తో వార్తల్లో ఉంటూనే ఉంది. లేటెస్ట్ గా కుర్చీ మడతపెట్టికి వచ్చిన వంద మిలియన్ల వ్యూస్ న్యూస్ వైరల్ అయింది.

గుంటూరు కారం పోస్ట్ రిలీజ్ హంగామా కాస్త తగ్గగానే గురూజీ ఫోకస్ మొత్తం ఐకాన్ స్టార్ ప్రాజెక్ట్ మీదే ఉంటుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప2 పనులతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత బన్నీ... పుష్ప3ని కూడా వెంటనే పట్టాలెక్కిస్తారా? అదే జరిగితే ఇంకో ఏడాది పాటు ఆయన త్రివిక్రమ్కి దొరికే ప్రసక్తే లేదు.

బన్నీ బిజీగా ఉన్నారు కదా అని, తారక్ వైపు చూద్దామంటే, అక్కడ కాల్షీట్ అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు చేతిలో ఉన్న దేవర పూర్తి చేయాలి. నార్త్ లో ఒప్పుకున్న వార్2 కంప్లీట్ చేయాలి. ఆ వెంటనే దేవర2 చేయాలి. అది కాకపోయినా ప్రశాంత్నీల్ సినిమా ఉంది... సో ఇంత పెద్ద క్యూలో త్రివిక్రమ్కి ప్లేస్ దొరకడం ఇప్పట్లో గగనమే.

అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ తన చిరకాల కోరిక గురించి ఆలోచిస్తున్నారట. అన్నీ కాన్సెప్టులను డైరక్ట్ చేయడం అయ్యేపని కాదు కనుక, మంచి కాన్సెప్టులతో నిర్మాతగా బిజీ కావాలన్నది త్రివిక్రమ్కి చిరకాల గోల్.

ఇప్పుడు కాస్త సమయం ఉంది కాబట్టి, ఆ దిశగా ప్లానింగ్ చేస్తున్నారని వినికిడి. మంచి కథలు రాసి, హోమ్ బ్యానర్లో నిర్మాతగా సినిమాలు చేయాలనుకుంటున్నారన్నది ఫ్రెష్ న్యూస్. ఈ వార్త వినగానే ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన చల్ మోహన్రంగాను గుర్తుచేసుకుంటున్నారు ఔత్సాహికులు.