హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఒకేసారి ఢమాల్ పడిపోవడం వెనక అసలు కారణమేంటి..? కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్తా లక్షల్లోకి ఎందుకొచ్చాయి..? గొంతెమ్మ కోర్కెలు కోరుతూ.. కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు..? పడిపోయిన నాన్ థియెట్రికల్ రైట్స్.. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్పై ప్రభావం చూపిస్తున్నాయా..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..
ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుందంట.. ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుందంటూ ఇండస్ట్రీలో నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికీ కోటి కూడా పారితోషికం అందట్లేదు. సడన్గా పడిపోయిన ఓటిటి రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది.
నాన్ థియెట్రికల్ బూమ్లో ఉన్నపుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటిటి స్ట్రీమింగ్స్కు ముందున్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. పైగా ఆడియన్స్ ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళ్తున్నారు. దాంతో నాన్ థియెట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశీ ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటిటిలోనూ కనిపించట్లేదిప్పుడు.
కరోనా టైమ్లో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటిటి వైపు వెళ్లారు. కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు. పైగా శ్రీలీల, కృతి శెట్టి లాంటి వాళ్లంతా ఓ సీజన్లో మెరిసి మాయం అయిపోతున్నారు. పూజా హెగ్డే, సమంత, తమన్నా టైమ్ అయిపోయింది. అందుకే మునపట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు.
సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్లు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు హీరోయిన్లు. కానీ అక్కడ కూడా నిర్మాతలు స్టార్స్ వైపు చూడట్లేదు. అందుకే కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వాళ్లు ఒకట్రెండు సిరీస్లతోనే కనుమరుగు అయిపోయారు. సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ఒక్కటే సిరీస్ చేసారు.. అదే సిటాడెల్. మొత్తానికి పెద్ద హీరోయిన్లకు ఒకప్పట్లా గోల్డెన్ టైమ్ అయితే నడవట్లేదిప్పుడు.