
తెలియకుండానే మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు అడివి శేష్. 2022లో హిట్ 2 వచ్చాక ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేస్తున్నారీయన.

ఇందులో డెకాయిట్ షూట్ చివరిదశకు వచ్చేయగా.. గూఢచారి 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ రెండూ తక్కువ గ్యాప్లోనే విడుదల కానున్నాయి.

నానక్రామ్ గూడ పరిసర ప్రాంతాల్లో డెకాయిట్ షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కింద పడ్డారని.. వాళ్లకు గాయాలు బాగానే అయినట్లు తెలుస్తుంది.

అదే గాయాలతో షూట్ పూర్తి చేసారని ప్రచారం జరుగుతుంది. గతంలోనూ డెకాయిట్ సెట్లో ఒకట్రెండు ప్రమాదాలు జరిగాయి. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. షానిల్ డియో దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అడివి శేష్, శృతి హాసన్ జంటగా మొదలైంది.

కానీ మధ్యలో శృతి తప్పుకోవడంతో మృణాళ్ జాయిన్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న డెకాయిట్ విడుదల కానుంది. మొత్తానికి ఈ ప్రమాదం నిజమా పబ్లిసిటీ స్టంటా అనేది తెలియదు కానీ డెకాయిట్కు ప్రమోషన్ అయితే బాగానే వచ్చింది.