
రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ అంశం దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన విషయం తెలిసిందే. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించిన తర్వాత ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తాయి. వీటిలో ఒకటి రూ. వెయ్యి నోటను మళ్లీ తిరిగిరానున్నారు అని. అయితే దీనిపై అధికారికంగా స్పందించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై తొలిసారి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. రూ. 2 వేల నోట్ల డిపాజిట్ చేసే సమయంలో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

మంగళవారం నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు అందుబాటులో ఉంచామన్నారు. ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువని, చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని శక్తిదాస్ తెలిపారు.

సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు రూ.2,000 నోట్లు ఖజానాకు చేరతాయని శక్తికాంత దాస్ అంచనా వేస్తున్నారు. నగదు మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదని, నాలుగు నెలల సమయం ఉందని తెలిపారు.

పెద్ద మొత్తంలో అయ్యే రూ. 2 వేల నోట్ల డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలను ఉన్నాయని.. వాటినే ఇప్పుడూ అమలు చేస్తాయని స్పష్టం చేశారు. రూ. 1000 నోటును తిరిగి తీసుకొస్తారన్న వార్తలను ఆర్బీఐ గవర్నర్ ఖండించారు. వేసవి నేపథ్యంలో నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి నీడ, నీళ్లు వంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని గవర్నర్ చెప్పుకొచ్చారు.