
దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడనుందనే వార్తల క్రమంలో బంక్లు వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. దీంతో బంక్ల వద్ద రద్దీ పెరగ్గా.. ముందుగానే పెట్రోల్, డీజిల్ నింపుకునేందుకు వాహనదారులు బారులు తీస్తున్నారు. దీంతో కొన్ని అవుట్లెట్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ కారణంతో మే 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం నడుస్తోంది.

హర్ముజ్ జలసంధి వద్ద అనిశ్చితి, అస్దిర పరిస్థితుల క్రమంలో మే 1 నుంచి ఇంధన ధరలు పెరుగుతాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో వచ్చే నెల 1 నుంచి ధరలను కేంద్ర ప్రభుత్వం వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రూ.25 నుంచి రూ.28 వరకు ధరలు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కేంద్రం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇంధన ధరల పెంపుపై తక్షణ ప్రణాళికుల ఏమీ లేవని, పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. దీని వల్ల వాహనదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సరఫరా వ్యవస్థ స్దిరంగా ఉందని పేర్కొంది.

ఇక దేశీయ ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ రవాణా సరఫరా కూడా 100 శాతం జరుగుతుందని, కమర్షియల్ గ్యాస్ సరఫరా కూడా 70 శాతం వరకు పునరుద్దరించబడిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, ఫార్మా, ఉక్కు, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ప్రాతిపదికన ఎల్పీజీ సరఫరా జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. 5 కేజీల సిలిండర్ వల్ల వలస కార్మికులకు ప్రయోజనం జరుగుతుందని పేర్కొంది.

అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం మొదలైనప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏప్రిల్ 23వ తేదీన కేంద్రం స్పందిస్తూ.. ఆ వార్తలను కొట్టిపారేసింది. తాజాగా మరోసారి ఖండించగా.. కానీ హర్ముజ్ జలసంధి వద్ద సరుకు రవాణా నిలిచిపోడం, ముడి చమురు ధరలు పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలు పెరగొచ్చనే ప్రచారం నడుస్తోంది.