
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూ్స్. ఇక నుంచి అదనపు లగేజీ కోసం ప్రత్యేకంగా రైల్వే పార్శిల్ బుకింగ్ ఆఫీసుకు వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ ద్వారా బకింగ్ చేసుకునే సదుపాయాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. మీరు టికెట్ కలిగి రిజర్వ్డ్ కోచుల్లో ప్రయాణిస్తుంటే ఆన్లైన్లోనే అదనపు లగేజీకి రుసుం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లగేజీ బుకింగ్ను మరింత వేగవంతం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆన్ లైన్ బుకింగ్కు అవకాశం కల్పించాలని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. జులై 31వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. దీంతో నేటి నుంచి ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రిజర్వుడ్ కంపార్ట్మెంటుల్లో ప్రయాణిస్తూ ధృవీకరించబడ్డ టికెట్ కలిగి ఉంటే గరిష్ట బరువు పరిమితి వరకు వ్యక్తిగత సామాన్లకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు.

మార్చి 7, 2025 తేదీన ఆన్లైన్ లగేజీ బుకింగ్కు సంబంధించి అన్ని జోనల్ రైల్వేలకు రైల్వే బోర్డు ఒక లేఖ పంపింది. ఏసీ 3-టైర్ (3AC), ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్ క్లాసుల్లో ఉచిత లగేజీ పరిమితి, గరిష్ట పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. ఆన్లైన్ బుకింగ్కు సంబంధించి క్లాసుల వారీగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్ట పరిమితి, పరిమితికి మించి తీసుకెళ్తే జరిమానాల గురించి ఈ లేఖలో పొందుపర్చింది.

మీరు ప్రయాణించే కాంపార్ట్మెంటుల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి రైల్వే నిబంధనలు అంగీకరించవు. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫస్ట్ ఏసీలో 70 కేజీలు, ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీలో 50 కేజీలు, థర్డ్ ఏసీ (3AC), ఏసీ చైర్ కార్ (CC), స్లీపర్ క్లాస్లో 40 కేజీలు, సెకండ్ క్లాస్లో 35 కేజీలు మాత్రమే ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితికి మంచి గరిష్టంగా కొంత పరిమితి వరకు మాత్రమే సామాన్లను తీసుకెళ్లవచ్చు. అయితే 1.5 రెట్లు అధిక ఛార్జీ విధిస్తారు.

వాణిజ్య వస్తువులను ప్యాసింజర్ కోచ్లలో తీసుకువెళ్లడానికి వీల్లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నిబంధనల ప్రకారం100 సెం.మీ × 60 సెం.మీ × 25 సెం.మీ (పొడవు × వెడల్పు × ఎత్తు) బాహ్య కొలతలు కలిగిన ట్రంకులు, సూట్కేసులు, పెట్టెలను ప్యాసింజర్ కోచ్లలో వ్యక్తిగత సామాన్లుగా తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.