ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఉపయోగపడేది ఏది అంటే అది బంగారం అని చెప్పక తప్పదు. మన వద్ద బంగారం ఉంటే బ్యాంకుల్లో ఇతర ఫైనాన్ష్ సంస్థల్లో తాకట్టు పెట్టి నిమిషాల్లోనే రుణం తీసుకోవచ్చు. రుణాల విషయంలో అత్యంత ఉపయోగపడేది బంగారం. తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా బంగారంపై సులభంగా రుణం పొందవచ్చు.
అయితే బంగారంపై రుణం తీసుకుంటే ఈఎంఐ పద్దతిలో చెల్లించే సదుపాయం లేదు. త్వరలోనే బంగారం రుణాలను ఈఎంఐ (EMI)లో చెల్లించే సదుపాయం తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బంగారంపై రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ (RBI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం గోల్డ్ను తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే రుణ కాలపరిమితి పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదా కాలపరిమితికి ముందే డబ్బులు ఉంటే అప్పటికి అసలు, వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సదుపాయం ఉంది.
ఈ రుణాల విషయంలో జరుగుతున్న అవకతవకలను ఆర్బీఐ గుర్తించింది. బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు, వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి గుర్తించింది. అంతే కాకుండా వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది అవలంబిస్తున్నట్లు ఆర్బీఐ గమనించింది.
ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల పద్దతిని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ ఇటీవల తమ సర్క్యులర్లో వెల్లడించినట్లు సంబంధిత కథనాలు పేర్కొన్నాయి.