
ఘోష విధానం అంటే రాజ కుటుంబ మహిళలు బయటకు రావద్దనే సంప్రదాయం. అలాంటి ఘోష పద్దతి వారి రాజరిక వ్యవస్థకు ప్రతిబింబంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆ విధానం పాటించబడుతోంది. గుడికి వెళ్లినా, ఇతర ప్రదేశాలకు వెళ్లినా రాజవంశ సంస్థాన మహిళలు బయటవారికి కనిపించకుండా చుట్టూ పరదాలు కట్టి తీసుకెళ్లటం అనవాయితీ. ఈ ఆనవాయితీ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అందుకే బొబ్బిలి అంతఃపురంలో ఉండే రాణిలను ఇప్పటి వరకు ప్రజలు ఎవరూ చూడలేదు.

ఆమె గురించి విన్నారేమోగాని, ఎలా ఉంటారో మాత్రం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మినహా ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఈ కట్టుదిట్టమైన సంప్రదాయాలు ఒక్కసారిగా పక్కకు జరిపి అమరావతిలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఇచ్చిన విందుకు బొబ్బిలి రాజవంశీయులు, యువరాజాగా పిలవబడే ఎమ్మెల్యే బేబీ నాయన తన సతీమణి శిల్పా ను తీసుకెళ్లడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవ్వరికీ ఎప్పుడూ కనిపించని యువరాణి.. రాజమహల్ గోడల మధ్య దాగిన నీడలా ఉన్న ఆమె, ఎన్నడూ అంతఃపురం వెలుపల అడుగు పెట్టని ఆ యువరాణి మొదటిసారి నేరుగా రాజకీయ వేదిక పై కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇది రాజకుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చే కొత్త సంకేతమా? లేకపోతే లోకేష్కు చూపిన కుటుంబ మర్యాద మాత్రమేనా? అన్న చర్చ జోరుగా నడుస్తుంది. అంతఃపురపు వేళ్ల పొదల్లో దాగిన యువరాణి ఒక్కసారిగా వెలుగులోకి రావడం వెనుక ఏదో కథ దాగి ఉందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. బొబ్బిలి చరిత్రలో ఎన్నో మలుపులు జరిగినా ఇలాంటి దృశ్యం అరుదనే చెప్పాలి.

అందుకే యువరాణి హాజరు ఇప్పుడు విజయనగరం, బొబ్బిలి రాజకీయాల్లో అత్యంత ఆసక్తిగా మారింది. అయితే సడన్ గా రాజకీయ వేదిక పై బేబీనాయన సతీమణి కనిపించడంతో అనేక రకాల ప్రచారాలు జోరందుకున్నాయి.

మహిళ రిజర్వేషన్ వైపు వేగంగా అడుగులు పడుతున్న వేళ బొబ్బిలి నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తే బేబీనాయన తన సతీమణి శిల్పా ను బరిలోకి దింపే యోచలో ఉన్నట్లు ప్రచారం కూడా బలంగా సాగుతుంది. ఏది ఎలా ఉన్న నాలుగు గోడలు దాటని కోటలోని యువరాణి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టడం శుభపరిణామంగా చెప్పవచ్చు.