
నంద్యాల, జనవరి 28: నంద్యాల జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాలలో అద్భుతమైన గుహలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. రంగు రంగుల లైట్లతో పర్యాటకులను కనువిందు చేయనున్నాయి.

బేతంచెర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా బిలస్వర్గం గుహలు సహజ సిద్ధంగా వెలిశాయి. వందల.. వేల.. ఏళ్ల నాటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని చూసి తరించే అవకాశం ప్రజలకు నిన్నటి వరకు రాలేదు.

అలాగే ప్యాపిలి మండలంలోనీ బోయవాళ్ళపల్లి దగ్గర ఉన్న వాల్మీకి గుహలు కూడా పర్యాటకుల సందర్శనార్ధం అందుబాటులోకి తీసుకొచ్చారు. పైన భూమి దాని కింద సహజసిద్ధంగా గుహలు కనువిందు చేస్తున్నాయి. ఈ రెండింటిని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి దాదాపు పదికోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించారు. గుహలకు ఉన్న సహజత్వం పోకుండానే వాటిని తీర్చిదిద్ది రహదారులు విద్యుత్తు అలంకరణలు చేయించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.

వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఈ గుహలోనే రాశారని, గుహలలో ఉన్న శివలింగాలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నాయని చెప్తుంటారు. అలాంటి గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక నేటి నుంచి ఈ రెండు గుహలలో సందడే సందడి.