PUNJAB CM CANDIDATE: ఊపుమీదున్న కాంగ్రెస్‌కు కీలక నేతల షాక్.. సీఎం క్యాండిడేట్ ఎవరో ప్రకటించాలంటూ డెడ్‌లైన్.. రాహుల్ ఏమన్నారంటే..?

| Edited By: Ravi Kiran

Jan 28, 2022 | 3:36 PM

పంజాబ్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి సరికొత్త సవాల్ ఎదురవుతోంది. ముఖ్యమంత్రి (CHIEF MINISTER) అభ్యర్థిని ప్రకటిస్తే ఆ నిర్ణయం పార్టీలోనే..

PUNJAB CM CANDIDATE: ఊపుమీదున్న కాంగ్రెస్‌కు కీలక నేతల షాక్.. సీఎం క్యాండిడేట్ ఎవరో ప్రకటించాలంటూ డెడ్‌లైన్.. రాహుల్ ఏమన్నారంటే..?
Follow us on

PUNJAB CM CANDIDATE ISSUE IRRITATES CONGRESS HIGH-COMMAND: పంజాబ్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి సరికొత్త సవాల్ ఎదురవుతోంది. ముఖ్యమంత్రి (CHIEF MINISTER) అభ్యర్థిని ప్రకటిస్తే ఆ నిర్ణయం పార్టీలోనే వికటించే ప్రమాదం కనిపించడంతో ఎవరిని సీఎం క్యాండిడేట్‌ (CM CANDIDATE)గా అనౌన్స్ చేయకుండానే ఎన్నికల తంతును పూర్తి చేద్దామని వ్యూహాత్మకంగా ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY) అధిష్టానానికి పంజాబ్ ముఖ్యమంత్రిత్వాన్ని అభిలషిస్తున్న ఇద్దరు కీలక నేతలు షాకిచ్చారు. ఇద్దరు కీలక నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాంటూ డెడ్ లైన్ విధించడంతో పార్టీ హైకమాండ్ ఖంగుతిన్నది. దాంతో రాహుల్ గాంధీ (RAHUL GANDHI) స్వయంగా స్పందించాల్సి వచ్చింది. అయితే.. ఆయన చేసిన ప్రకటన డెడ్ లైన్ విధించిన ఇద్దరు నేతలను సంతృప్తి పరచకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో అయోమయం నెలకొందని చెప్పాలి. సీఎం క్యాండిడేట్ ఎవరో ప్రకటించాల్సని తరుణం ఆసన్నమైందని, వారం, పది రోజుల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ ఆ ఇద్దరు కీలక నేతలు విధించిన డెడ్ ‌లైన్ ఇపుడు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయంశమైంది.

కెప్టెన్ అమరీందర్ సింగ్‌ (CAPTAIN AMARINDAR SINGH)కు సీఎం సీటు నుంచి ఉద్వాసన పలికిన కాంగ్రెస్ హైకమాండ్ ఆ సీటును క్రికెటర్ టర్న్‌డ్ పొలిటీషియన్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ (NAV JYOTH SINGH SIDDU)కు ఇస్తుందని అందరు అనుకున్నారు. సిద్దూ సైతం తానే సీఎంనని కలలుగన్నారు. అదే ఊపులో పొరుగు దేశం పీఎం ఇమ్రాన్ ఖాన్ (IMRAN KHAN) అభినందనలు కూడా పొందేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనూహ్య నిర్ణయంతో సిద్దూకు షాకిచ్చింది. చరణ్ జిత్ సింగ్ చన్నీ (CHARANJITH SINGH CHANNY)ని పంజాబ్ ముఖ్యమంత్రిని చేసింది. చన్నీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని సంకేతాలిచ్చింది. హైకమాండ్ నిర్ణయంతో షాక్‌కు గురైన సిద్దూ.. పార్టీని వీడినంత పని చేశారు. కానీ అంతలోనే సర్దుకుపోయారు. ఇందుకు కారణం ఎన్నికల తర్వాత తనను ముఖ్యమంత్రిని చేస్తారన్న ఆశే కావచ్చని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే.. సిద్దూని కన్విన్స్ చేసేందుకు ఆయన్ను పీసీసీ అధ్యక్షున్ని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీ అధ్యక్షునిగా తానే పంజాబ్‌లో మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రి సీటు కొట్టేయాలని సిద్దూ వ్యూహరచన చేశారు. అయితే.. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సైతం తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా.. సీఎం సీటుకున్న పవర్‌ని వినియోగించుకుని ఎన్నికల్లో గెలిస్తే తానే సీఎంనని చాటుకుంటున్నారు.

ఈక్రమంలోనే అటు సిద్దూ, ఇటు చన్నీల మధ్య పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండుగా విడిపోయాయి. ప్రస్తుతం మరో 25 రోజుల్లో పంజాబ్ ఓటింగ్ జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కొత్త సవాల్ ఎదురైంది. వచ్చే వారం, పది రోజుల్లో అంటే ఫిబ్రవరి మొదటి వారం ముగిసేలోగా (ఓటింగ్ ఫిబ్రవరి 22న జరుగుతుంది) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని రాహుల్ గాంధీకి జనవరి 27న సిద్దూ డెడ్ లైన్ విధించారు. జలంధర్ వేదికగా జరిగిన ప్రచార సభలో సిద్దూ ఈ మేరకు నేరుగా రాహుల్ గాంధీనుద్దేశించి ప్రకటన చేశారు. తనను షో కేసులో బొమ్మలా చూపాలని కోరుకోవడం లేదని, తక్షణమే సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవాలని సిద్దూ అన్నారు. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటిస్తేనే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 70 సీట్లు గెలుచుకుంటుందని సిద్దూ తెలిపారు. అయితే.. అదే వేదికపై వున్న సీఎం చన్నీ కూడా సిద్దూ మాటకు వంత పలికారు. సభా వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకున్న చన్నీ.. తమ మధ్య విభేదాలు లేవని చాటే ప్రయత్నం చేశారు. అయితే.. సీఎం అభ్యర్థిపై ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కరెక్టు కాదని, పెళ్ళి కొడుకు (సీఎం క్యాండిడేట్) లేకుండా కాంగ్రెస్ పార్టీ వివాహానికి రెడీ అయ్యిందంటూ ఎద్దేవా చేస్తున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని చన్నీ పార్టీ హైకమాండ్‌ని కోరారు.

ఓవైపు చన్నీ, ఇంకోవైపు సిద్దూ.. ఇలా ఇద్దరు కలిసి ఓకే వేదికపై సీఎం క్యాండిడేట్‌ని ప్రకటించాలని డిమాండ్ చేయడంతో రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. అయితే.. ఆ ఇరకాటం నుంచి తెలివిగా తప్పించుకునే ప్రయత్నించారు రాహుల్ గాంధీ. పంజాబ్ కాంగ్రెస్ శ్రేణులను సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని రాహుల్ వెల్లడించారు. అదేసమయంలో అసలు సీఎం క్యాండిడేట్‌ ఎవరో ప్రకటించాల్సిన అవసరం వుందా అన్నది కూడా కాంగ్రెస్ శ్రేణులే నిర్ణయిస్తాయని ఆయన మెలిక పెట్టారు. ఇద్దరు నేతలు (సిద్దూ, చన్నీ) సమన్వయంతో వున్నారని, ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరు మద్దతు ఇస్తామని ప్రకటించారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇద్దరిలోను కాంగ్రెస్ పార్టీ రక్తమే ప్రవహిస్తోందని, ఎవరికి అవకాశం దొరికినా మరొకరితో ఎలాంటి సమస్యలు రావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే.. అంతటి ధీమా వున్నప్పటికీ సీఎం క్యాండిడేట్ ప్రకటనపై మీనమేషాలెందుకో అన్నది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. ఇదే అంశాన్ని మరోరకంగా చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు విసురుతోంది. ఏది ఏమైనా సిద్దూ, చన్నీల డెడ్‌లైన్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, పంజాబ్ ఎన్నికల్లో ఓటమి పాలైతే అందుకు సీఎం క్యాండిడేట్‌ ఎవరో ప్రకటించలేకపోవడం కూడా ఓ కారణమవుతుందని సిద్దూ, చన్నీ శిబిరాల్లో కీలక వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.