
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా దేశాల మధ్య యుద్ధం ఒక పట్టాన ముగియడం లేదు.. ఈ మారణహోమానికి ఒక అంతం ఇప్పట్లో కనిపించడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మరో సమస్య వెంటాడుతోంది. ప్రాణభయంతో సొంత దేశాలకు పారిపోతున్న చాలా మంది ప్రవాసులు.. తమ పెంపుడు జంతువులను రోడ్ల మీదే అనాథలుగా వదిలేసి వెళ్లాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా యూఏఈ లాంటి దేశాల్లో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కలు, పిల్లులు ఇప్పుడు వీధుల్లో దిక్కు లేకుండా తిరుగుతున్నాయి. ఇందుకు కారణం.. ఆయా జంతువులను విమానాల్లో వెంట తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోవడమే.
సరైన పత్రాలు, సమయం లేకపోవడంతో ప్రజలు తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు జంతువులను నిర్ధాక్షిణ్యంగా వదిలేయాల్సిన హృదయవిదారక పరిస్థితి తలెత్తుతోంది. అయితే.. ఈ బాధాకరమైన స్థితిలో ఊరట కలిగించే విషయం ఏంటంటే.. పెంపుడు జంతువుల విషయంలో కేంద్ర ప్రభుత్వం భారతీయులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గల్ఫ్ దేశాల నుంచి కుక్కలు, పిల్లులను భారత్కు సురక్షితంగా తీసుకొచ్చేందుకు వీలుగా నిబంధనల్లో వన్-టైమ్ రిలాక్సేషన్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న పరిస్థితులను గ్రహించిన మన దేశం.. ఓ గొప్ప ఆలోచన చేసింది. యుద్ధం వల్ల పూర్తి డాక్యుమెంట్లు తేవడం కష్టమని గ్రహించి.. పొరుగు దేశాలు జారీ చేసిన వెటర్నరీ హెల్త్ సర్టిఫికెట్ ఉన్నా అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. పత్రాలు సమర్పిస్తే జంతువులకు నేరుగా ఎయిర్పోర్టులోనే యానిమల్ క్వారంటైన్ సర్వీసెస్(AQCS) అధికారులు క్లినికల్ పరీక్షలు చేస్తారని వెల్లడించింది. ఇది చాలా మంది భారతీయులకు కొంత మేర ఊరట కలిగించే విషయం.
ఒకవేళ ఈ పరీక్షల్లో మూగజీవాలకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలితే వెంటనే వాటిని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తాం” అని కూడా కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఏది ఏమైనా ప్రాణంగా పెంచుకునే మూగ జీవాలను రోడ్ల పాలు చేయలేక కన్నీరు పెడుతున్న ప్రవాస భారతీయులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే ఎంతో పెద్ద ఊరట. మిగతా దేశాలలాగా కాకుండా మన కేంద్ర ప్రభుత్వం ఒంటరి అవుతున్న జంతువుల పట్ల తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.