వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

వెనిజులాలో చమురు, గ్యాస్‌తో పాటు మెటల్స్, ఫార్మా రంగాల్లో భారతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, అమెరికా ఆంక్షలు ఈ పెట్టుబడులకు సవాల్‌గా మారాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం చూస్తున్న భారత్‌కు వెనిజులాతో సంబంధాలు కీలకమైనప్పటికీ, ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?
Indian Investments In Venezuela

Updated on: Jan 04, 2026 | 10:05 PM

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా పేరుగాంచిన వెనిజులా.. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఆ అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఇప్పటికే భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. కేవలం చమురుకే పరిమితం కాకుండా.. మెటల్స్, ఫార్మా వంటి కీలక రంగాల్లోనూ భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి.

ఆయిల్ – గ్యాస్

భారతదేశ ఇంధన అవసరాల్లో వెనిజులా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి చమురు క్షేత్రాల్లో మన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చురుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ONGC విదేశ్, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా అక్కడ చమురు క్షేత్రాల్లో భాగస్వాములుగా ఉన్నాయి. ముఖ్యంగా సాన్ క్రిస్టోబల్ వంటి ప్రాజెక్టుల్లో OVL వాటాను కలిగి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, MRPL వంటి సంస్థలు వెనిజులా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. వెనిజులా నుంచి వచ్చే హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే సామర్థ్యం మన దేశీయ రిఫైనరీలకు ఉండటం భారత్‌కు పెద్ద అడ్వాంటేజ్.

మెటల్స్ – ఇండస్ట్రియల్

చమురు తర్వాత వెనిజులాలో లోహ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వెనిజులాలోని అతిపెద్ద ఐరన్-ఓర్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించడం ద్వారా జిందాల్ గ్రూప్ అక్కడ తన పట్టును పెంచుకుంది.
ఇంజనీర్స్ ఇండియా కరాకస్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని, అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఫార్మా రంగం

వెనిజులా ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతీయ ఔషధ కంపెనీల పాత్ర మరువలేనిది. సన్ ఫార్మా, గ్యెన్‌మార్క్ కంపెనీలు అక్కడ సొంత యూనిట్లను ఏర్పాటు చేసి స్థానికంగా మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. సిప్లా తమ ఎగుమతుల ద్వారా అక్కడి రోగులకు అవసరమైన ప్రాణరక్షణ మందులను అందుబాటులో ఉంచుతోంది. ఒకప్పుడు అక్కడ బలంగా ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2024లో తన వాటాలను విక్రయించి వ్యూహాత్మకంగా వైదొలిగింది.

సవాళ్లు – అవకాశాలు

వెనిజులాలో పెట్టుబడులు పెట్టడం భారత్‌కు లాభదాయకమే అయినా అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, అమెరికా ఆంక్షల ప్రభావం అతిపెద్ద సవాలుగా పరిణమించాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం చూస్తున్న తరుణంలో వెనిజులాతో సంబంధాలు భారత్‌కు అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మాత్రం భారత్‌కు ఆందోళన కలిగించేవిగా చెప్పొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..