మతపరమైన విద్యాబోధన జరిగే మదర్సాలపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం..!

మదర్సాలు మతపరమైన విద్యాబోధన జరిగే పాఠశాలలు. స్వతంత్రంగా నిర్వహిస్తారు. వాటికి సంబంధించి గవర్నమెంట్ దగ్గరా ఎలాంటి లెక్కాపత్రం ఉండదు. కానీ ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మదర్సాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ జరుగుతోంది. కానీ అందుకు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకూ మదర్సాలను ప్రభుత్వ పరిధిలోకి తెస్తే నష్టమా ? లాభమా.?

మతపరమైన విద్యాబోధన జరిగే మదర్సాలపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం..!
Madarsa Board

Updated on: Apr 29, 2026 | 7:37 AM

మదర్సాల్లో చదువు ఒక్కటే కాదు, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే పాఠశాలలుగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈమధ్య మహిళలే ఉగ్రవాదులుగా మారుతున్న సంఘటలు తెరపైకి వచ్చాయి. వీటికి మూలం పాకిస్తాన్‌లో నిర్వహించబడుతున్న మదర్సాలేనన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై భారత నిఘా సంస్థలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మదర్సాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలు ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును సిద్ధం చేసింది. “పారదర్శకత, విద్యా ప్రమాణాలు, పిల్లల భవిష్యత్” కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బిల్లు ప్రకారం రాష్ట్రంలో నడుస్తున్న అన్ని మదర్సాల వివరాలు నమోదు చేయడం తప్పనిసరి.

ప్రస్తుతం దేశంలో అనేక మదర్సాలు స్వతంత్రంగా, స్థానికంగా నడుస్తూ వచ్చాయి. కొన్నింటికి రిజిస్ట్రేషన్ ఉన్నా, మరికొన్ని పూర్తిగా అనధికారికంగా కొనసాగుతున్నాయనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి మదర్సా తప్పనిసరిగా అధికారిక రికార్డుల్లో నమోదు కావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సరికొత్త రూల్ తీసుకురాబోతోంది. విద్య అందుతున్నా, ఆ విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయలేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే మదర్సా విద్యావిధానంపై పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది.

ఇప్పటి వరకు మదర్సాలలో ప్రధానంగా ఇస్లామిక్ విద్య, ఖురాన్ పఠనం, మతపరమైన పాఠాలు నేర్పేవారు. కానీ కొత్త విధానంలో గణితం, సైన్స్ వంటి వాటిని కూడా చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల మదర్సా విద్యార్థులు మెయిన్‌స్ట్రీమ్ విద్యా వ్యవస్థలోకి రావడానికి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మదర్సాలు తమ సంప్రదాయ విధానాల ప్రకారం సిలబస్ రూపొందించుకునే స్వేచ్ఛ ఉండేది. కానీ బిల్లు ప్రకారం ఆ స్వేచ్ఛ ఇక నుంచి ఉండదు.

ఉత్తరాఖండ్ ప్రబుత్వ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మతపరమైన బోధనపై ప్రభుత్వ జోక్యం పెరగడం వల్ల మదర్సాల అసలు లక్ష్యం దెబ్బతింటుందని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మదర్సాలు కేవలం విద్యా కేంద్రాలు కాకుండా మతపరమైన గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రతీకలుగా ఉన్నాయని, ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు మత స్వేచ్ఛపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి ముస్లిం సంఘాలు

మరోవైపు మదర్సాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్‌లో అతిపెద్దదైన జామియా సిరాజ్‌ ఉల్ ఉలూమ్‌ను ప్రభుత్వం వేటు వేయడం సంచలనమైంది. ఈ మదర్సాలో కొన్ని వందల మంది విద్యార్ధులు మతపరమైన పాఠాలు నేర్చుకుంటున్నారు. అయితే ఇందులో చదివిన మాజీ విద్యార్ధుల్లోని కొందరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్‌ ఇచ్చింది. అంతేకాదు నిషేధిత జమాత్ ఇ ఇస్లామీతో రహస్య సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే మదర్సాకు సంబందించిన భూమిసేకరణ, రిజిస్ట్రేషన్‌, ఆర్దిక అంశాల్లోనూ గందరగోళం ఉంది. అందుకే మదర్సా ఆస్తులను సీజ్ చేసి, ప్రాంగణాన్ని మూసివేశారు. దీనిపై కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది టార్గెట్ పెట్టుకుని నిషేధించినట్లుగా ఉందని ఆమె విమర్శించారు.

ఇలా మదర్సాలపై కేంద్రం నిఘా పెంచింది. ఈనేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మదర్సాలపై ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు ఉండాలి, మత స్వేచ్ఛకు ఎక్కడి వరకు హద్దులు పెట్టాలన్నదానిపై పెద్ద డిస్కషన్ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us